Fishermen Clashes: మత్స్యకారుల మధ్య తలెత్తిన వివాదాలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అప్పలరాజు స్పందించారు. దురదృష్టవశాత్తు వలల విషయంలో మత్స్యకారుల మధ్య కొన్ని వివాదాలు తలెత్తాయని అన్నారు. ఇప్పుడు ఆ వివాదాలన్నీ సమసిపోయాయని మంత్రి చెప్పుకొచ్చారు. కాలం మారుతుంది.. చేపలు పట్టే విధానమూ మారుతుందన్నారు. ఇప్పుడు కొత్తగా వస్తున్న వలల్లో అనేక మార్పులు జరగడం వల్ల ఎక్కువ చేపలు లభించటానికి ఆస్కారం ఉందని మంత్రి పేర్కొన్నారు. అయితే సంప్రదాయ పద్ధతిలో తెప్పలపై వేట చేసే వాళ్ల వలల వల్ల చిన్న చిన్న చేపలకు ఇబ్బంది ఎదురవుతుందన్నారు. ఈ వలల వలన రాబోయే తరాలకు మత్స్య సంపద తగ్గిపోయే అవకాశం ఉందని మంత్రి అప్పలరాజు చెప్పుకొచ్చారు.
ఎక్కువ చేపలు లభించడానికి వాడే సంప్రదాయ వలల వల్ల మత్స్య సంపదకు ఇబ్బంది ఉందన్నారు. రింగ్ వలలు, బల్ల వలల వల్ల చిన్న చిన్న చేపలు.. గుడ్లు పెట్టె చేపలు కనుమరుగయ్యే అవకాశం ఎక్కువగా ఉందని మంత్రి అప్పలరాజు వివరించారు. మత్స్యకారుల మధ్య ఎలాంటి గొడవలు జరగకుండా ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చామన్నారు. వలల వల్ల నష్టాలు, లాభాలపై మత్స్యకారులకు పూర్తిగా వివరించామన్నారు. ఈ వేట వల్ల చేపల పెరుగుదల, సంపద తగ్గే పరిస్థితి ఉన్నందున.. వాళ్లకి అర్థం అయ్యేలా వివరించానని మంత్రి తెలిపారు. చిన్నప్పటి నుంచి తనకు మత్స్య సంపదపై అవగాహన ఉందని, తానూ మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన వాడినే కాబట్టి వారి క్షేమాన్నే తాను కోరకుంటానని మంత్రి అప్పలరాజు చెప్పుకొచ్చారు.
అయితే, 8 కి.మీ పరిధిలోనే సంప్రదాయ వేట చేసుకునేలా మత్స్యకారుల్లోని ఇరు వర్గాలను ఒప్పించామని మంత్రి అప్పలరాజు తెలిపారు. 8 కి.లో మీటర్ల దాటి సంప్రదాయ వేటకు వెళితే మాత్రం ఫైన్ విధిస్తామని స్పష్టం చేశారు. అవసరం అయితే లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉందన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మత్స్యకార సంఘాలు, మెరైన్ ఫిషరీస్ కమిటీ, ఇతర అధికారులతో కలిపి ఒక కమిటీని వేశామన్నారు. వలల మత్స్యకారుల పరిస్థితిపై, వివాదం నేపథ్యంలో వేసిన కమిటీల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తామన్నారు. ప్రస్తుతం మత్స్యకారుల మధ్య గొడవ సద్దుమణిగినట్లేనని, పెద్ద ఇబ్బంది ఏం లేదన్నారు. మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకూడదని కోరుకుంటున్నామని మంత్రి అప్పలరాజు ఆకాంక్షించారు.
Also read:
12 ‘O’ Clock Movie : పొంగల్ బరిలో వర్మ కూడా.. అసలైన పండుగ ’12 O’Clock’ తోనే అట