Vahana Mitra: ఆంధ్రప్రదేశ్లో వాహనమిత్ర పథకానికి నిధులు విడుదల వ్యవహారం.. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి తెర లేపింది. తాజాగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుపై టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి, మాన్సస్ చైర్మన్ అశోక్ గజపతి రాజు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వాహనమిత్ర పథకానికి దేవాదాయ శాఖ నిధులు వినియోగించలేదంటూ చేసిన వ్యాఖ్యలపై అశోక్ గజపతి రాజు భగ్గుమన్నారు. వెల్లంపల్లి వ్యాఖ్యలను ఖండిస్తూ.. ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. వాహనమిత్రకు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీని ట్విట్టర్లో అటాచ్ చేసిన అశోక్ గజపతి రాజు.. మంత్రి వెల్లంపల్లిని నిలదీశారు. నిధుల విడుదల అంశంలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు వాస్తవమా? లేక ప్రభుత్వం జారీ చేసిన జీవో వాస్తవామా? అని ప్రశ్నించారు. ఈ రెండింటిలో ఏది వాస్తవం అంటూ మంత్రిని అశోక్ గజపతి రాజు నిలదీశారు.
కాగా, రాష్ట్ర ప్రభుత్వం వాహనమిత్ర పథకానికి దేవాదాయశాఖ నిధులను ఉపయోగించిందంటూ ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు.. వాహనమిత్ర పథకానికి ఒక్క రూపాయి కూడా దేవాదాయశాఖ నిధులు వినియోగించలేదని స్పష్టం చేశారు. ఈ అంశంలో ప్రతిపక్షాలు.. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శలు గుప్పించారు.
Also read: