Andhrapradesh: మండల, జిల్లా పరిషత్​లలో ప్రత్యేక అధికారుల పాలన పొడగింపు.. ఎప్పటివరకు అంటే

|

Jul 02, 2021 | 9:53 PM

ఆంధ్రప్రదేశ్‌లో  మండల, జిల్లా పరిషత్​లలో ప్రత్యేక అధికారుల పాలనను మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 4 తేదీతో ప్రత్యేకాధికారుల..

Andhrapradesh: మండల, జిల్లా పరిషత్​లలో ప్రత్యేక అధికారుల పాలన పొడగింపు.. ఎప్పటివరకు అంటే
Ap Government
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో  మండల, జిల్లా పరిషత్​లలో ప్రత్యేక అధికారుల పాలనను మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 4 తేదీతో ప్రత్యేకాధికారుల పాలన ముగుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కూడిన పాలకమండలి ఏర్పాటైతే ప్రత్యేకాధికారుల పాలన ముగుస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పరిషత్ ఎన్నికలు ముగిసినా..లెక్కింపుపై హైకోర్టులో విచారణ ఉండటంతో ప్రత్యేకాధికారుల పాలనను పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. . జూలై 5 నుంచి ఈ పొడిగింపు అమల్లోకి వస్తుందని వివరించారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఏపీలో పరిషత్‌ ఎన్నికలు జరగాల్సి ఉండగా..  వివిధ కారణాల వల్ల ఎలక్షన్స్ నిర్వహించలేదు. దీంతో స్థానిక సంస్థల పాలన కోసం ప్రత్యేక అధికారులను నియమించారు. ఇక, జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే వ్యవస్థ కొనసాగుతూ వచ్చింది.. కొంత కాలం ఎన్నికల నిర్వహణ విషయంలో.. ఎన్నికల కమిషన్‌, ప్రభుత్వం మధ్య వివాదం నడవగా.. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించినా.. కౌంటింగ్‌పై కోర్టులో విచారణ సాగుతోన్న సంగతి తెలిసిందే.

ఉన్నత విద్యాలయాల్లోనూ నాడు-నేడు పథకం వర్తింపు

నాడు – నేడు పథకంలో భాగంగా మౌలిక సదుపాయాల నిర్వహణపై ప్రామాణిక విధానాన్ని అనుసరించాల్సిందిగా జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్​వాడీ కేంద్రాల్లో మునుపటి స్థితి, నాడు-నేడు పథకంలో భాగంగా అభివృద్ధి చేసిన అనంతరం తీసిన ఫొటోలను ప్రదర్శించాల్సిందిగా సూచనలు ఇచ్చింది. భౌతికంగా వచ్చిన మార్పులను ప్రదర్శించేలా ఫొటోలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. దీనికోసం పీవీసీ బ్యానర్లు వినియోగించవద్దని ప్రభుత్వం ఆదేశించింది. పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖ, వైద్యారోగ్యశాఖ, సాంఘిక సంక్షేమం, పురపాలక – పట్టణాభివృద్ధిశాఖ, మహిళా సంక్షేమం తదితర శాఖలు అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాల నిర్వహణకు ప్రామాణిక విధానాన్ని ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. నాడు-నేడు పథకంలో నిర్దేశించిన 9 అంశాలు రాష్ట్రంలోని పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్​వాడీ కేంద్రాల స్వరూపాన్ని మారుస్తాయని స్పష్టం చేసింది. ఈ పథకాన్ని ఇంటర్, డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పాలిటెక్నిక్ , ఐటీఐలు, ఇతర వైద్యారోగ్య సంస్థలకూ వర్తింప చేయాలని భావిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Also Read:  శ్రీగంధం తోటల్లో ఊహించని సిత్రాలు.. ఖంగుతిన్న ఖాకీలు.. మత్తు పదార్థాల తయారీ గుట్టు రట్టు

ఊర పందుల వాహనం హైజాక్‌..! సినిమా రేంజ్‌లో స్కెచ్.. వీడియో చూస్తే షాకవుతారు..