AP News: ఏపీలో క్రీస్తు పూర్వం వెయ్యేళ్ల నాటి ఆనవాళ్లు.. లోహయుగపు నాటి సమాధులు ఇవిగో..

| Edited By: Janardhan Veluru

Sep 30, 2024 | 5:16 PM

క్రీస్తు పూర్వం వెయ్యేళ్ల నాటి ఆనవాళ్లు దొరికాయి. అది ఎక్కడో కాదు పల్నాడు జిల్లా వెల్ధుర్తి మండలం గంగలకుంట గ్రామ సమీపంలో పది నుంచి ఇరవై అడుగుల ఎత్తున్న పెద్ద పెద్ద నాపరాళ్ల ఆనవాల్లు అక్కడ కనిపించాయి.

AP News: ఏపీలో క్రీస్తు పూర్వం వెయ్యేళ్ల నాటి ఆనవాళ్లు.. లోహయుగపు నాటి సమాధులు ఇవిగో..
Gangalakunta
Follow us on

క్రీస్తు పూర్వం వెయ్యేళ్ల నాటి ఆనవాళ్లు దొరికాయి. అది ఎక్కడో కాదు పల్నాడు జిల్లా వెల్ధుర్తి మండలం గంగలకుంట గ్రామ సమీపంలో పది నుంచి ఇరవై అడుగుల ఎత్తున్న పెద్ద పెద్ద నాపరాళ్ల ఆనవాల్లు అక్కడ కనిపించాయి. దీంతో స్థానికులు అవి ఏంటో అని స్థానికులు ప్లీచ్ ఇండియా పౌండేషన్ అధ్యక్షుడు శివనాగిరెడ్డికి సమాచారం అందించారు. ఈ సందర్బంగా ఆయన రచయిత పావులూరి సతీష్ కుమార్, జర్నలిస్టు ఉప్పుతోళ్ల రమేష్ బాబు, పరావస్తు పరిశోధకుడు పాములపాటి శ్రీనాధ్ రెడ్డిలతో అక్కడికి చేరుకొని వాటిని పరిశీలించారు.

వాటిని పరిశీలించిన తర్వాత అవి లోహయుగపు నాటి సమాధులుగా తేల్చారు. పల్నాడు జిల్లా వెల్ధుర్తి మండలం గంగలకుంట గ్రామ సమీపంలో ఉన్న ఈ నిలువ రాళ్లను స్థానికులు ఆవగాహన లేక తవ్విపోస్తున్నారు. అయితే ఇవి క్రీస్తు పూర్వం వెయ్యేళ్ల ముందువిగా గుర్తించారు. వీటిని మెన్ హిర్‌లుగా పిలుస్తారని చెప్పారు. గంగలకుంట గ్రామానికి నైరుతి దిక్కులో కృష్ణా నది ఒడ్డున ముగ్గుదిన్నె కాలువకు అటు ఇటు మూడు చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ సమాధులున్నట్లు గుర్తించారు.

భూమిలో నాలుగు రాళ్లను ఒక గదిలా అమర్చి అందులో శవాన్ని పెట్టి పైన నాపరాళ్లతో కప్పేవారని శివనాగిరెడ్డి తెలిపారు. ఆ గది చుట్టూ గుండ్రంగా బండరాల్లను పేర్చి ఆపైన గుళకరాళ్లను ఉబ్బెత్తుగా అమర్చినట్లు ఆనవాళ్లు తెలియజేస్తున్నాయన్నారు. దూరం నుంచి కూడా కనిపించే విధంగా వాటిపై ఇరవై అడుగుల ఎత్తున నాపరాళ్లును సమాధులపైన ఉంచారన్నారు. ఆ నాపరాళ్లపై ఎద్దు, ముగ్గు, తదితర పోలిన రేఖాచిత్రాలున్నట్లు గుర్తించారు. ఇవన్నీ లోహయుగపు నాటి అంత్యక్రియ పద్దతులుగా శివనాగిరెడ్డి వివరించారు.

గతంలో చాలా పెద్దఎత్తున ఈ నాపరాళ్లు కనిపించేవని స్థానికులు తెలిపారు. కాలక్రమేణా వాటిని వ్యవసాయ పనుల్లో ఉపయోగించుకునేందుకు కొంతమంది తరలించుకపోయారని, ప్రస్తుతం ఒక పదిహేను ఇరవై వరకూ ఇటువంటి ఆనవాళ్లు కనపిస్తున్నాయని చెప్పారు. వీటిని తొలగించకుండా స్థానికులకు అవగాహన కల్పిస్తామని ప్రభుత్వం కూడా వీటిని ధ్వంసం చేయకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని శివనాగిరెడ్డి చెప్పారు. పల్నాడు ప్రాంతంలో అనేక చారిత్రిక ఆనవాళ్లున్నాయని ఈ ప్రాంత ప్రాముఖ్యతను తెలిపే వాటిని పరిరక్షించుకోవడానికి అటు ప్రభుత్వం ఇటు స్థానికులు కలిసి పనిచేయాల్సి అవసరం ఉందని ఆయన చెప్పారు.