Eco Friendly House: డ్యూప్లెక్స్ విల్లాలు వద్దు.. మట్టి మిద్దెలే ముద్దు.. యువకుల వినూత్న ప్రయత్నం.. ఆకర్షిస్తున్న ఆర్కిటెక్చర్స్

| Edited By: Surya Kala

Jan 23, 2024 | 10:47 AM

మట్టి ఇల్లు తక్కువ ఖర్చుతో నిర్మాణం జరుగుతాయని, ఆరోగ్యానికి కూడా మంచిదని, వాటిని నిర్మించుకోవాలని సూచిస్తున్నారు ఆ యువకులు.కెమికల్స్ తో కూడిన ముడి సరుకుల జోలికి పోకుండా సహజ సిద్ధంగా లభ్యమయ్యే మట్టితోనే పూర్వకాలంలో చేపట్టిన ఇంటి నిర్మాణాన్ని మరోసారి గుర్తు చేస్తూ ఆ రకమైన బాణీలోనే ఇళ్లను నిర్మిస్తున్నారు.

Eco Friendly House: డ్యూప్లెక్స్ విల్లాలు వద్దు.. మట్టి మిద్దెలే ముద్దు.. యువకుల వినూత్న ప్రయత్నం.. ఆకర్షిస్తున్న ఆర్కిటెక్చర్స్
Eco Friendly House
Follow us on

మన పూర్వీకులంతా దాదాపు మట్టి ఇళ్లల్లోనే నివాసం ఉండేవారు. మట్టి ఇళ్లల్లో నివాసం ఉండటం గ్రామస్థాయిలో ఇప్పటికీ అక్కడక్కడ చూస్తూనే ఉంటాం. మట్టి గోడలు, తాటాకులతో పైకప్పుతో, కింద నేల పైన మట్టి, ఆవు పేడతో అలికి ఇంటి నిర్మాణ పనులు ఉండేవి. అలా నిర్మించే ఇంటి నిర్మాణం చాలా తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో పూర్తయ్యేది. ప్రస్తుతం రోజు రోజుకి పెరుగుతున్న లేటెస్ట్ టెక్నాలజీ కారణంగా మట్టి ఇళ్లు కూడా కనుమరుగవుతూ వచ్చాయి. దీంతో ఇప్పుడు గ్రామాల్లో మట్టిల్లులనేవి ఎక్కడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ మట్టి ఇళ్లకు ప్రాధాన్యమిస్తూ మట్టి ఇళ్ల వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ వాటి నిర్మాణాల పై శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు విజయనగరం జిల్లా మెరకముడిధాం మండలం బొడందొర వలసకు చెందిన యువకులు.

మట్టి ఇల్లు తక్కువ ఖర్చుతో నిర్మాణం జరుగుతాయని, ఆరోగ్యానికి కూడా మంచిదని, వాటిని నిర్మించుకోవాలని సూచిస్తున్నారు ఆ యువకులు.కెమికల్స్ తో కూడిన ముడి సరుకుల జోలికి పోకుండా సహజ సిద్ధంగా లభ్యమయ్యే మట్టితోనే పూర్వకాలంలో చేపట్టిన ఇంటి నిర్మాణాన్ని మరోసారి గుర్తు చేస్తూ ఆ రకమైన బాణీలోనే ఇళ్లను నిర్మిస్తున్నారు. గ్రామస్థాయిలో విరివిగా లభ్యమయ్యే మట్టితో చేపట్టే మట్టి ఇళ్ల నిర్మాణాల పై అవగాహన కల్పించేందుకు ఆర్కిటెక్చర్ ఆదిత్య శర్మ, అతని స్నేహితుడు కిషోర్ లు కలిసి ఒక శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి స్థానిక యువతకు శిక్షణ అందిస్తున్నారు.

మట్టి ఇళ్లను తయారు చేసే విధానం

ఖాళీ పాస్లిక్ గోనె సంచుల నిండా మట్టిని నింపి ఒక గోడలాగా ఒకదాని పై ఒకటి పెట్టి వరుసగా పేర్చుతారు. ఆ తరువాత ఒక వరుసకు మరో వరుసకు మధ్య ఉన్న ఖాళీల వద్ద మట్టిని పెట్టి గోడను చదరంగా సిద్ధం చేస్తారు. గుమ్మం, కిటికీలు సహజసిద్ధంగా తయారయ్యే కలపతోనే తయారు చేస్తారు. ఇంటి పై కప్పును కూడా బలమైన కలప దుంగలను పేర్చి వాటి పై మట్టితో ఒక పొరను తయారు చేస్తారు. వర్షం పడినా పై కప్పు మట్టి కరిగిపోకుండా పైన గడ్డి వేసి కోతకు గురికాకుండా ఏర్పాట్లు చేస్తారు. ఇలా సహజసిద్ధమైన పద్దతిలోనే అందమైన నిర్మాణాలు చేపడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు ఆ యువకులు.

సిమెంట్, ఐరన్ వంటి మెటీరియల్స్ వల్ల పొల్యూషన్ ఏర్పడుతుందని, మనిషి ఆహారంలో ఆర్గానిక్ ఫుడ్ ఎంత అవసరమో మట్టితో నిర్మించే ఇల్లు కూడా అంతే అవసరం ఉంటున్నారు. తాము చేపట్టిన ఈ పద్దతిలో మాత్రమే తక్కువ ఖర్చుతో నిర్మాణాలు సాధ్యమవుతాయని, ఇంటి లోపల కూడా మనకు కావాల్సిన రీతిలో ఇంటిరియల్ చేసుకోవచ్చని చెప్తున్నారు. కేవలం లక్ష రూపాయల ఖర్చుతో ఇద్దరు యువకులు నిర్మిస్తున్న అందమైన, ఆరోగ్యవంతమైన ప్రకృతి సిద్ధ ఇళ్ల నిర్మాణాలు ఇప్పుడు జిల్లాలో అందరినీ ఆసక్తి రేపుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..