Aqua Industry – AP – West Godavari – Grandhi Srinivas : ఆక్వా దిగుమతులపై చైనా కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. ఫలితంగా జిల్లాలో రొయ్యలు సాగు చేసే రైతులు ఆర్థిక ఇబ్బందులపాలవుతున్నారని ఆయన వెల్లడించారు. ఇలాంటి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ఏపీ తీర ప్రాంతాలలో రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం తమ జిల్లాలో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం వైఎస్ జగన్మోహన్ దృష్టికి తీసుకెళతానని గ్రంధి శ్రీనివాస్ టీవీ9 కు తెలిపారు.
ఇలా ఉండగా, ఆక్వా పరిశ్రమతోపాటు, ఆంధ్రప్రదేశ్ లోని మత్స్యకారులకు అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో కూడిన బృహత్తర ప్రాజెక్టుకు ఏపీ సర్కారు ఇప్పటికే శ్రీకారం చుట్టింది. తొలిదశలో భాగంగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నాలుగు ఫిషింగ్ హార్బర్లకు సీఎం వైఎస్ జగన్ గతేడాది శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం వాటి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వీటితోపాటు, రాష్ట్రంలో మరో నాలుగు చోట్ల కూడా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు కూడా జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
అంతేకాక, రాష్ట్రంలో 25 ఆక్వాహబ్ల నిర్మాణ పనులు గతేడాది నవంబర్ నుంచి షురూ అయ్యాయి. వీటితో పాటు నియోజకవర్గానికో ఆక్వాహబ్ నిర్మాణం, జనతా బజార్లలో నాణ్యమైన రొయ్యలు, చేపలను అందుబాటులోకి తెచ్చేందుకు జగన్ సర్కాకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఫిషరీస్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కూడా ఏపీ సర్కారు ఇప్పటికే ఆర్డినెన్స్ తెచ్చింది.