డ్రాగన్ కంట్రీపై అగ్రరాజ్యం ప్రతీకారానికి దిగింది. వెయ్యి మందికి పైగా చైనా పౌరులకు యునైటెడ్ స్టేట్స్ వీసాలను రద్దు చేసింది. భద్రతా పరమైన కారణాల దృష్ట్యా వీసాలు రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి బుధవారం ప్రకటించారు.
కరోనా వైరస్పై సరైన సమాచారం ఇవ్వలేదని చైనాపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న అమెరికా… ఆ దేశంపై ప్రతీకార చర్యల దిశగా సాగుతోంది. దేశ భద్రతకు ముప్పుందనే సాకుతో… అమెరికాలో సేవలందిస్తున్న చైనా టెలికాం సంస్థపై నిషేధానికి సిద్ధమవుతోంది. చైనా టెలికాం సంస్థపై ఆంక్షలు విధించాలని, అనుమతులు రద్దుచేయాలని ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్-FCCకి… రక్షణ, హోం, వాణిజ్య సహా అత్యున్నత శాఖలు సూచించాయి.
ఇక, ఇప్పటివరకు వెయ్యి మందికిపైగా చైనీయుల వీసాలను రద్దు చేసినట్లు తాజాగా ప్రకటించింది. మే నెలలో అమెరికా అధ్యక్షుడి ప్రకటన ఆధారంగా ఈ వీసాల రద్దు చేసినట్లు పేర్కొంది. ‘చైనా నుంచి అమెరికాకు వస్తోన్న విద్యార్థులు, పరిశోధకులకు చైనా మిలటరీతో సంబంధాలు ఉంటున్నాయన్న అనుమానం వ్యక్తం చేసింది. అమెరికాకు చెందిన సమాచారాన్ని వీరు తస్కరించకుండా నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ చీఫ్ చాడ్ వోల్ఫ్ వెల్లడించారు. చట్టవ్యతిరేక వ్యాపార పద్ధతులు, గూఢచర్యం పేరుతో అమెరికా మేధో సంపత్తితోపాటు కరోనా వైరస్ పరిశోధనా సమాచారాన్ని తస్కరించేందుకు విద్యార్థి వీసాలను చైనా దుర్వినియోగం చేస్తోందని చాడ్ వోల్ఫ్ మరోసారి ఆరోపించారు. చైనా జిన్జియాంగ్ ప్రాంతంలో ముస్లింలపై వేధింపులకు పాల్పడినట్లు స్పష్టమైన అధారాలు ఉన్నాయని, బానిస కార్మికుల నుండి ఉత్పత్తి చేసిన వస్తువులను తమ మార్కెట్లలోకి రాకుండా అమెరికా అడ్డుకుంటుందని వోల్ఫ్ అన్నారు.