ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పేలుడు పదార్థాలు నింపిన ఓ కారులో వచ్చి.. గజనీ ప్రాంతంలో పేల్చేశారు. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 50 మందికి పైగా తీవ్రగాయాలపాలయ్యారు. ఆ ప్రాంతంలో ఉన్న నిఘా అధికారులే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎనిమిది మంది నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ (ఎన్డీఎస్)కు చెందిన వారు కాగా, నలుగురు పౌరులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ తాలిబన్లు ప్రకటించారు.
ఆదివారం ఉదయం ఆ ప్రాంతంలో రద్దీ ఉన్న సమయంలో ఈ దాడి చోటు చేసుకుందని వివరించారు. ఈ దాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వ ప్రతినిధి అరీఫ్ నూరీ నిర్ధారించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తాలిబన్ ప్రతినిధులు, అఫ్గాన్ ప్రభుత్వ ప్రతినిధులకు మధ్య ఖతార్ రాజధాని దోహాలో చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు తాలిబన్ ఉగ్రవాదులు దాడులను కొనసాగిస్తూనే ఉన్నారు.