Quarantine Effect: ఒక వైపు కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతుంటే మరో వైపు కొందరు క్వారంటైన్ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. కరోనా తీవ్రంగా ఉన్ననేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించరాదని ప్రభుత్వాలు, పోలీసులు పదేపదే చెబుతున్నా.. కొందరు పెడచెవిన పెడుతున్నారు. తాజాగా తైవాన్కు చెందిన ఓ వ్యక్తి హోం క్వారంటైన్ నిబంధనలను ఏడు సార్లు ఉల్లంఘించినందుకు అతని నుంచి అధికారులు రూ. 35 వేల డాలర్లు (రూ.25 లక్షలకుపైగా) జరిమానా విధించారు. సెంట్రల్ తైవాన్లోని తైచుంగ్ ప్రాంతంలో సదరు వ్యక్తి నివాసముంటున్నట్లు అధికారులు గుర్తించారు. వ్యాపారం ట్రిప్ మీద చైనాకు వెళ్లి వచ్చి హోం క్వారంటైన్లో ఉండకుండా బయట తిరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇలా మూడు రోజుల వ్యవధిలో ఏడు సార్లు నిబంధనలను ఉల్లంఘించాడని తెలిపారు. ఈ మూడు రోజుల్లో షాపింగ్ అని, కారు సర్వీసింగ్, ఇతర కారణాలతో చుట్టు పక్కల ప్రాంతాలు తిరిగేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
స్థానికంగా ఉండే వ్యక్తి ఈ విషయాన్ని గమనిచి అధికారులకు తెలుపడంతో వారు ఈ చర్యకు దిగారు. ఈ విషయం తైచుంగ్ మేయర్ వరకు వెళ్లడంతో నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి కఠినమైన శిక్ష వేయాలంటూ ఆదేశించారు.
కాగా, అతనికి రూ. 25 లక్షల జరిమానాతో పాటు క్వారంటైన్లో ఉన్నంత కాలం రోజుకు 107 డాలర్లు (రూ.7,800) చెల్లిస్తూనే ఉండాలని మేయర్ ఆదేశించారు. అయితే తైవాన్లో ఇప్పటి వరకు మొత్తం 889 మంది కరోనా బారిన పడగా, ఏడుగురు మృతి చెందారు. ఇతర దేశాలతో పోలిస్తే అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నా.. నిబంధనలు మాత్రం చాలా కఠినంగా ఉన్నాయి.