ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కట్టడికి ప్రపంచ దేశాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. పూర్తి స్థాయిలో కట్టడి కాలేకపోతోంది. వైరస్కు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా విజృంభిస్తోంది. వ్యాక్సిన్ తయారీలో భారత్తో పాటు ప్రపంచ దేశాలు సైతం తలమునకలవుతున్నాయి. తాజాగా ఫ్రాన్స్ దేశ ప్రధాని జీన్ క్యాస్టెక్స్ కీలక విషయాన్ని తెలియజేశారు. డిసెంబర్ చివరి నాటికి ఫ్రాన్స్కు 11.6 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు చేరుకుంటాయని అన్నారు. అలాగే రానున్న రెండు నెలల్లో మరో 23 లక్షల డోస్లు దేశానికి వస్తాయని పేర్కొన్నారు.
ఒక్కొక్కరికి డోస్లు వేయాల్సి ఉండటంతో ఫ్రాన్స్ కు వచ్చే 39 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులను 17 లక్షల మందికి ప్రభుత్వం వేయనుందని ఆయన అన్నారు. వయసు పైబడిన వారు, కరోనా బారిన పడిన వారు, హెల్త్ వర్కర్లకు ముందుగా ఈ వ్యాక్సిన్ డోసులను వేయనున్నట్లు చెప్పారు. అయితే కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో ప్రభుత్వం మరింత పారదర్శకంగా ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. ప్రజలందరికి వ్యాక్సిన్ వేసే విషయంలో తమ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని అన్నారు. అయితే, ఫ్రాన్స్ జనాభా దాదాపు 7 కోట్లు ఉంటే.. ప్రభుత్వం ఇప్పటి వరకు 20 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఆర్డర్ చేసింది.
కాగా, ఫ్రాన్స్ దేశంలో ఇప్పటి వరకు మొత్తం 24,09,070 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనాతో ఇప్పటి వరకు 59,361 మంది మరణించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో ఫ్రాన్స్ ఐదో స్థానంలో ఉంది.