కరోనా టెస్ట్ కోసం రోబోలు..

|

Sep 22, 2020 | 3:45 PM

లక్షలాది మంది ప్రాణాల్ని బలిగొన్న ఈ రక్కసిపై పోరులో ముందువరుసలో నిలబడి పనిచేస్తున్నారు కరోనా వారియర్స్. ఈ వైరస్ బారి నుంచి వారి కాపాడేందుకుసింగపూర్‌ ప్రభుత్వం ఓ వినూత్న ప్రయత్నం చేసింది.

కరోనా టెస్ట్ కోసం రోబోలు..
Follow us on

ప్రపంచాన్ని కరోనా కుదిపేస్తోంది. మాయదారి రోగం బారిన పడి కోట్లాది మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. లక్షలాది మంది ప్రాణాల్ని బలిగొన్న ఈ రక్కసిపై పోరులో ముందువరుసలో నిలబడి పనిచేస్తున్నారు కరోనా వారియర్స్. ఈ వైరస్ బారి నుంచి వారి కాపాడేందుకుసింగపూర్‌ ప్రభుత్వం ఓ వినూత్న ప్రయత్నం చేసింది. శాంపిల్స్ సేకరించే టైంలో కరోనా అంటుకోకుండాలన్న లక్ష్యంతో ప్రత్యేక రోబోను అభివృద్ధి చేసింది. కరోనా పరీక్షల్లో ఆరోగ్య సిబ్బందిని పరిమితంగా వినియోగించడంతో పాటు ఇలాంటి క్లిష్ట సమయంలో వారి కొరతను అధిగమించవచ్చంటున్నారు.

ఇకపై కొత్తగా రూపొందించిన ‘స్వాబోట్‌’ తోనే స్వాబ్‌ టెస్ట్‌లు నిర్వహించాలని సింగపూర్ ప్రభుత్వం భావిస్తోంది. నేషనల్‌ క్యాన్సర్‌ సెంటర్‌ సింగపూర్‌ (ఎన్‌సీసీఎస్‌), సింగపూర్‌ జనరల్‌ ఆస్పత్రి (ఎస్‌జీహెచ్‌) వైద్యులు మెడికల్‌ రొబొటిక్స్‌ టెక్నాలజీ కలిగిన బయోబోట్‌ సర్జికల్‌ సంస్థ భాగస్వామ్యంతో ‘స్వాబోట్‌’ను అభివృద్ధి చేసినట్టు న్యూస్‌ ఆసియా ఛానల్‌ వెల్లడించింది. శిక్షణ కలిగిన తమ దేశ ఆరోగ్య సిబ్బందికి కొవిడ్‌ ముప్పు లేకుండా.. కరోనా టెస్టుల్లో వారి సేవల్ని పరిమితం చేసేలా ఈ రోబోలను తయారు చేసినట్లు వెల్లడించింది. కరోనా అనుమానితుల ముక్కు నుంచి ఆటోమేటిక్‌గా ఈ రోబోలే స్వాబ్‌ తీస్తాయని ఆ సంస్థలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఈ స్వాబోట్‌ స్వీయ నిర్వహణ కలిగినదని, రోగులు దీన్ని తమ ఇష్టప్రకారం వినియోగించుకొనే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.

కరోనా పరీక్షలకు సిద్ధమైన వాళ్లు తమ గడ్డాన్ని రోబో దగ్గరకు తీసుకురాగానే అది యాక్టివేట్‌ అవుతుంది. అనంతరం స్వాబింగ్‌ ప్రక్రియ కొనసాగుతుందని వైద్యులు తెలిపారు. నాసికా రంధ్రాల నుంచి దాదాపు 10.సెం.మీల మేర లోపలకు వెళ్లి నాసికా కుహరంలో స్వాబ్‌ను సేకరిస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఎంతో సున్నితమైన ఈ ప్రక్రియలో సర్జన్ల మాదిరిగానే ఇది చాలా సున్నితంగా.. కచ్చితత్వంతో స్వాబ్‌ తీస్తుందని ఎస్‌జీహెచ్‌ వైద్యులు డాక్టర్‌ లూకే టే చెప్పారు. ముక్కు నిర్మాణం, ఆకృతుల్లో తేడా ఉన్నప్పటికీ నమూనాల నాణ్యత మాత్రం స్థిరంగా ఉంటుందని వైద్యులు వివరించారు.