బ్రిటన్ వెళ్లాలనుకునే భారతీయులు.. కాస్త ముందువెనక ఆలోచించుకుని వెళ్లాలని వార్నింగ్ ఇచ్చింది భారత ప్రభుత్వం. బ్రిటన్లో అల్లర్లు అదుపుతప్పుతున్నందున.. జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అందులోనూ వలసవాదులే టార్గెట్గా బ్రిటన్లో దాడులు జరుగుతున్నాయి. ఆల్రెడీ బ్రిటన్లో ఉన్న భారతీయులు.. స్థానిక సెక్యూరిటీ ఏజెన్సీల గైడెన్స్ పాటించాలంటూ లండన్లోని భారత హైకమిషన్ స్టేట్మెంట్ ఇచ్చింది.
బ్రిటన్ అట్టుడికి పోతోంది. మనిషి రంగు చూసి మరీ దాడి చేస్తున్నారు. వలసవాదులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్థానికులు. వీధుల్లోకి వచ్చి మరీ ఆందోళనలు చేస్తున్నారు. 2011 నాటి అల్లర్ల తరువాత ఆ స్థాయిని మించి హింస జరగడం ఇదే మొదటిసారి. ఇంతటి పరిస్థితికి కారణం.. వారం క్రితం జరిగిన మూడు హత్యలే. సౌత్ పోర్టులోని ఓ డ్యాన్స్ స్కూల్లో ముగ్గురు చిన్నారులను కత్తితో పొడిచి చంపేశారు దుండగులు. ఈ దాడిలో మరో పది మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ పని చేసింది బ్రిటన్కు వలస వచ్చిన వ్యక్తే అంటూ ఆందోళనలకు దిగారు స్థానికులు. ఈ సంఘటన తరువాత మొదలైన అల్లర్లు దాదాపుగా బ్రిటన్ మొత్తం పాకాయి.
Indian travellers would be aware of recent disturbances in some parts of the United Kingdom. The High Commission of India in London is closely monitoring the situation. Visitors from India are advised to stay vigilant and exercise due caution while travelling in the UK. It is… pic.twitter.com/0t1f35qU3G
— ANI (@ANI) August 6, 2024
ఒక్క సంఘటన.. ముగ్గురి మృతి కారణంగా జరుగుతున్న దాడులు కావివి. వలసవాదులపై, అంటే బ్రిటన్లో తలదాచుకునేందుకు వచ్చిన శరణార్ధులపై పెరిగిన అసహనంతో జరుగుతున్న దాడులుగా చూస్తున్నారు విశ్లేషకులు. బ్రిటన్కు శరణార్ధులుగా వచ్చిన వారికి ప్రత్యేక వసతి ఇచ్చి, ఆహార సదుపాయాలు కూడా చూస్తోంది అక్కడి ప్రభుత్వం. ఎన్నో ఏళ్లుగా నడుస్తోంది. పైగా మొదట్లో స్థానికులు కూడా శరణార్దుల పట్ల, వలస వచ్చిన వారి పట్ల దయతోనే ఉండే వారు. కాని, రానురాను వలసవాదుల అరాచకాలు పెరుగుతూ వచ్చాయంటున్నారు బ్రిటన్ వాసులు. శరణార్ధులు ఉండే ప్రదేశం మీదుగా నడవాలన్నా సరే బ్రిటన్ ప్రజలు భయపడే స్థాయికి పరిస్థితులు మారాయి.
అత్యాచారాలు, బెదిరింపులు, దొంగతనాలతో వలసవాదులు పేట్రేగిపోతున్నారని ఆరోపిస్తున్నారు. తలదాచుకోడానికి వచ్చిన వాళ్లు.. చివరికి బ్రిటన్ రాజ్యాంగాన్నే మార్చాలని డిమాండ్ చేసే స్థాయికి ఎదిగారంటూ ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు బ్రిటన్వాసులు. ముఖ్యంగా ఓ వర్గం వారిపై బ్రిటన్ ప్రజల్లో అసహనం, ఆగ్రహం పెరిగిపోయింది. దేశంలో ఆ వర్గం వారి సంఖ్య విపరీతంగా పెరగడం, రాజ్యాంగాన్ని సైతం మార్చాలనే డిమాండ్ ఆ వర్గం వారి నుంచి వినిపిస్తుండడం.. స్థానికులైన బ్రిటన్వాసులకు అస్సలు రుచించడం లేదు.
ఎన్నాళ్లగానో అణచిపెట్టుకున్న ఆవేశాన్ని.. సౌత్ పోర్టులో ముగ్గురు చిన్నారుల హత్య తరువాత ఇక ఆపుకోలేకపోయారు. అందుకే, “రూల్ బ్రిటానియా”, ”ఇంగ్లండ్.. టిల్ ఐ డై”, ”వుయ్ వాంట్ అవర్ కంట్రీ బ్యాక్” అనే నినాదాలతో హోరెత్తిస్తున్నారు. లివర్ పూల్, బ్లాక్ పూల్, హల్, బ్రిస్టల్, లీడ్స్, స్టోక్ ఆన్ ట్రెంట్, బెల్ ఫాస్ట్, నాటింగ్ హోమ్, మాంచెస్టర్లలో వలసవాదులు ఉండే హోటళ్ల మీద ఆందోళనకారులు దాడులకు దిగారు.
అయితే, ప్రభుత్వ వాదన మరోలా ఉంది. ముగ్గురు చిన్నారులను హత్య చేసిన నిందితుడు.. వలసవాది కాదని చెబుతోంది అక్కడి ప్రభుత్వం. బ్రిటన్లో పుట్టి పెరిగిన.. బ్రిటన్లో అత్యధికులు అనుసరించే మతానికి చెందిన వ్యక్తే ఈ దురాగతానికి పాల్పడ్డాడంటూ ప్రభుత్వం ప్రకటించింది. అయినా సరే.. అల్లర్లు ఆగడం లేదు. శరణార్ధులను ఉంచే హోటళ్లపైకి స్థానికులు రాళ్లు విసురుతూ, నిప్పు పెడుతున్నారు. షాప్స్, మాల్స్, వ్యాపార సంస్థల్లో లూటీలు జరుగుతున్నాయి. బ్రిటన్ వ్యాప్తంగా తమ దేశ రంగు కాని వాళ్లపై దాడులు చేస్తున్నారు. పరిస్థితి చేయి దాటుతుండడంతో ఇప్పటి వరకు వంద మందికి పైగా ఆందోళనకారులను అరెస్ట్ చేశారు పోలీసులు.
ముగ్గురు చిన్నారులను చంపింది బ్రిటన్ వ్యక్తేనని చెబుతున్నా సరే ఆందోళనకారులు వినకపోవడంతో.. దీని వెనక ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ అనే సంస్థ ఉందని అనుమానిస్తున్నారు. ఆ సంస్థకు అతివాద, ఛాందసవాదా అనే పేరుంది. వలసవాదులు ఎక్కువగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేస్తున్నది ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ సంస్థేనని భావిస్తున్నారు. పైగా ఈ సంస్థకు స్థానికుల నుంచి మద్దతు కూడా పెరుగుతోంది. ఇదే బ్రిటన్ ప్రభుత్వాన్ని కలవర పెడుతోంది. కొత్తగా ప్రధాని బాధ్యతలు తీసుకున్న కీర్ స్టార్మర్కు ఇప్పుడీ అల్లర్లు సవాల్గా మారాయి. ఓవైపు ఉక్కుపాదంతో అల్లర్లను అణచివేస్తాం అని స్టేట్మెంట్లు ఇస్తున్నప్పటికీ.. దాడులు మాత్రం ఆగడం లేదన్న చర్చ జరుగుతోంది. బ్రిటన్ ప్రధానమంత్రి స్మార్మర్ చెప్పినంత సీరియస్గా.. అల్లర్ల అణచివేత జరగడం లేదని చెబుతున్నారు. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు, సీసాలు విసిరేశారు. ఈ హింసలో చాలామంది అధికారులు గాయపడ్డారు. మొత్తంగా బ్రిటన్లో అల్లర్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..