Bangladesh Crisis: అప్పుడు పారిపోయాడు.. ఇప్పుడు లండన్‌ నుంచి చక్రం తిప్పాడు.. కట్ చేస్తే.. షేక్ హసీనా చాప్టర్ క్లోజ్

|

Aug 06, 2024 | 4:39 PM

బంగ్లాదేశ్‌లో విధ్వంసకాండ కంటిన్యూ అవుతోంది. దేశం మొత్తం అల్లర్లలో అట్టుడికిపోతోంది. రిజర్వేషన్ల విషయంలో చెలరేగిన మంటలు... దేశం మొత్తాన్ని తగలబెట్టేస్తున్నాయి. రాజధాని ఢాకాలో పరిస్థితి అత్యంత భయానకంగా మారింది. సైన్యం సైతం ఆందోళనకారుల్ని కంట్రోల్‌ చేయలేకపోతోంది.

Bangladesh Crisis: అప్పుడు పారిపోయాడు.. ఇప్పుడు లండన్‌ నుంచి చక్రం తిప్పాడు.. కట్ చేస్తే.. షేక్ హసీనా చాప్టర్ క్లోజ్
Sheikh Hasina, Tariq Rehman
Follow us on

బంగ్లాదేశ్‌లో విధ్వంసకాండ కంటిన్యూ అవుతోంది. దేశం మొత్తం అల్లర్లలో అట్టుడికిపోతోంది. రిజర్వేషన్ల విషయంలో చెలరేగిన మంటలు… దేశం మొత్తాన్ని తగలబెట్టేస్తున్నాయి. రాజధాని ఢాకాలో పరిస్థితి అత్యంత భయానకంగా మారింది. సైన్యం సైతం ఆందోళనకారుల్ని కంట్రోల్‌ చేయలేకపోతోంది. ప్రజాప్రభుత్వం కూలిపోగానే బంగ్లాదేశ్‌ అల్లకల్లోలంగా మారింది. షేక్‌ హసీనా ఇంటిని ఆందోళనకారులు లూటీ చేశారు. కుర్చీలు, టేబుళ్లు, పూలబొకేలు అన్నిటినీ ఎత్తుకెళ్లిపోయారు. పరుపులు, ఫ్యాన్లు, ల్యాంపులు, ఇలా ఏది కనిపిస్తే అది దోచుకెళ్లారు. బంగ్లా‌ ప్రధాని అధికారిక నివాసం గణభవన్‌లోనూ లూటీచేశాయి అల్లరిమూకలు. పోలీసులు, సైన్యం సైతం ఈ అరాచకాన్ని ఆపే ప్రయత్నమే చేయలేదు.

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లు షేక్ హసీనా కుర్చీని లాగేసింది. బంగ్లాదేశ్‌లో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న షేక్ హసీనా.. దేశాన్ని వదిలి భారత్‌లో తలదాచుకున్నారు. షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత బంగ్లాదేశ్‌లో ఆర్మీ పాలన కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌లో జరిగిన ఈ తిరుగుబాటులో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) యాక్టింగ్ చైర్మన్ తారిక్ రెహమాన్ ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇంతకాలం లండన్ ఉన్న రెహమాన్ బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంతకీ బంగ్లాదేశ్‌లో తారిక్ రెహమాన్ ఎవరో..? అతని స్థాయి ఏమిటో తెలుసుకోవడం అవసరం.

తారిఖ్ రెహ్మాన్ BNP తాత్కాలిక ఛైర్మన్. అతను ఫిబ్రవరి 2018 నుండి ఈ పదవిలో కొనసాగుతున్నాడు. అతను మాజీ అధ్యక్షుడు జియా ఉర్ రెహ్మాన్, మాజీ ప్రధాని ఖలీదా జియాల పెద్ద కుమారుడు. జియా ఉర్ రెహమాన్ బంగ్లాదేశ్ 7వ అధ్యక్షుడు. అదే సమయంలో, ఖలీదా జియా దేశ 10వ ప్రధానమంత్రి. ఇది మాత్రమే కాదు, ఆమె బంగ్లాదేశ్ మొదటి మహిళా ప్రధాన మంత్రి కూడా.

నవంబర్ 20, 1965లో జన్మించిన తారిక్ రెహ్మాన్ అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. అతను పాకిస్తాన్‌లోని కరాచీలో జన్మించారు. 2018లో ఢాకా గ్రెనేడ్ దాడిలో అతనికి జీవిత ఖైదు పడింది. అప్పటి నుంచి ఆయన విదేశాల్లోనే తలదాచుకుంటున్నాడు. అతన్ని బంగ్లాదేశ్‌లో పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించారు. బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీ అధికారంలో ఉన్నప్పుడు, తారిక్ రెహమాన్‌కు మంచి పేరు ఉండేది. ఖలీదా జియా తర్వాత, అతను BNP అత్యంత శక్తివంతమైన నాయకుడుగా ఎదిగారు.

ఢాకాలోని BAF షాహీన్ కళాశాలలో తన ప్రారంభ విద్యను పూర్తి చేసిన తర్వాత, అతను 1980లలో ఢాకా విశ్వవిద్యాలయంలోని అంతర్జాతీయ సంబంధాల విభాగంలో చేరాడు. 1991 ఎన్నికలకు ముందు, అతను తన తల్లి బేగం ఖలీదా జియాతో కలిసి దేశంలోని దాదాపు ప్రతి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని విజయం సాధించారు. ఆ తర్వాత అతని తల్లి బంగ్లాదేశ్ మొదటి మహిళా ప్రధాన మంత్రి అయ్యారు. అతను BNP యూనిట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఉన్న బోగురాలో అట్టడుగు స్థాయి నుండి నాయకులను ఎన్నుకునే ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రారంభించాడు. అతను 2009లో BNP సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. క్రమంగా BNP పునర్నిర్మాణంలో పాలుపంచుకున్నారు. 2018లో ఖలీదా జియా జైలు పాలైనప్పుడు, పార్టీ తాత్కాలిక అధ్యక్షుడిగా తారిక్ రెహ్మాన్‌ను నియమించారు. అప్పటి నుంచి షేక్ హసీనాకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు.

1994లో, బంగ్లాదేశ్ మాజీ నేవీ చీఫ్ ఆ తర్వాతి ప్రభుత్వాలలో రెండుసార్లు మంత్రిగా పనిచేసిన దివంగత రియర్ అడ్మిరల్ మహబూబ్ అలీ ఖాన్ కుమార్తె డాక్టర్ జుబైదా రెహమాన్‌ను తారిక్ రెహమాన్ వివాహం చేసుకున్నారు. జుబైదా రెహమాన్ క్వాలిఫైడ్ కార్డియాలజిస్ట్. ఢాకా మెడికల్ కాలేజీ నుండి శిక్షణ పొందారు. వీరికి జైమా జర్నాజ్ రెహ్మాన్ అనే కూతురు ఉంది.

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..