తమ దేశంలో ఈస్టర్ సందర్భంగా జరిగిన మారణహోమం నుంచి శ్రీలంకవాసులు ఇంకా కోలుకోలేదు. ఇప్పటికీ వందల మంది క్షతగాత్రులు లంకలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు మరిన్ని పేలుళ్లు జరగొచ్చన్న నిఘావర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన పోలీసులు, దేశంలోని అణువణువును నిశితంగా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పదులుగా భావించిన వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా శ్రీలంకను తాజాగా అమెరికా హెచ్చరించింది.
మరో వారం రోజుల వ్యవధిలో శ్రీలంకలో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని అగ్రరాజ్యం వెల్లడించింది. ఈ నెల 28వరకు కొలంబోలోని ప్రార్థనాలయాలకు వెళ్లొద్దని శ్రీలంక ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ట్విట్టర్లో ఓ పోస్టు చేసిన అమెరికా అధికారులు.. ‘‘ఎక్కువ మంది జనం గుమికూడిన చోటికి అసలు వెళ్లొద్దు’’ అంటూ పేర్కొన్నారు.