రాయదుర్గంలో నకిలీ పోలీస్గా చలామణీ అవుతున్న సాయి కిరణ్ తేజ అనే యువకుడి ఆట కట్టించారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. గత కొన్నిరోజులుగా సైబరాబాద్ పరిధిలోని బ్యూటీ పార్లర్ల యజమానులను క్రైం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నకిలీ గుర్తింపు కార్డు చూపించి మరికొండ సాయి కిరణ్ తేజ(30) బెదిరిస్తూ అధిక మొత్తంలో నగదు వసూలు చేస్తున్నట్టు మాదాపూర్ SOT పోలీసులకు సమాచారం అందింది. దీంతో సదరు నిందితుడిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే మంగళవారం రాయదుర్గంలోని స్టార్ వెల్నెస్ అండ్ ఫ్యామిలీ సెలూన్ యజమానిని బెదిరించి రూ. 10 వేలు పట్టుకుని బయటకు వస్తున్న నిందితుడ్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు మాదాపూర్ SOT పోలీసులు. సదరు నిందితుడి వద్ద నుంచి రూ. 10 వేలు నగదు, ఒక మొబైల్ ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడ్ని రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఖాకీలు.