ఓవైపు వాయుగుండం.. మరోవైపు చలిపులి.. తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా పలు జిల్లాల్లో భారీవర్షాలు పడుతుండగా ఇదే సమయంలో చలిపులి పంజా విసురుతోంది. కొద్ది రోజులుగా రికార్డు స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి వణికిస్తుంది. పొద్దున తొమ్మిది గంటలు దాటితే గానీ.. సూర్యుడు కనపడని పరిస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో చలికాల ప్రభావం మొదలైంది. ప్రధాన నగరాలతో పాటు ముఖ్యపట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో చలి విజృంభిస్తోంది. ఉదయం చలిగాలుల ఉధృతి పెరగడంతో అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సీజనల్ వ్యాధులతో పాటు శ్వాసకోశ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా.. పట్టణాల్లోనూ చలి ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పొద్దుపొద్దునే రహదారులన్నీ పొగమంచు కప్పుకోవడంతో.. ప్రయాణికులు ఇబ్బంది పడుతోన్నారు. రోజు రోజూ రాత్రి , పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.