86 ఏళ్ళ వయసులో ఆయన ఏకంగా 4 లక్షల కిలోమీటర్లు సైక్లింగ్ చేసి ఔరా అనిపించారు. కాలినడకన 20 సార్లు హిమాలయాలను కూడా చుట్టేశారు. ఈయన పేరు బైలహల్లి జనార్థన్. వయస్సు 86 ఏళ్లు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉంటున్నారు. ఆయనకు సైకిలింగ్, ట్రెక్కింగ్ అంటే ప్రాణం. అయితే, ఆయన మూర్ఛ వ్యాధి ఉంది. ఆ వ్యాధే అతని జీవన విధానంలో సరి కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది.
58 ఏళ్ల వయస్సులో మూర్ఛ వ్యాధిబారిన పడిన జనార్థన్.. రోజు ధ్యానంతో దాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నించారు. కానీ, అది కుదరలేదు. ఓ రోజు ఆయన నడక ప్రారంభించి చాలా దూరం ప్రయాణించారు. అప్పటి నుంచి అతనికి మూర్ఛ రాలేదు. దీంతో రోజు నడవటం అలవాటు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను 64 ఏళ్ల వయస్సులో సైక్లింగ్ మొదలుపెట్టాను. నాలో ఆత్మ విశ్వాసం పెరిగిన తర్వాత 68 ఏళ్ల వయస్సులో ట్రెక్కింగ్ చేయడం మొదలుపెట్టాను. ఇప్పటివరకు 20 సార్లు హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేశాను. మౌంట్ కైలాశ్ను కూడా చుట్టి వచ్చాను’’ అని తెలిపారు.
జనార్థన్ 64 ఏళ్ల వయస్సులో మొదలుపెట్టిన సైకిలింగ్ 86 ఏళ్లయినా ఆగలేదు. అలా 22 ఏళ్లుగా ఆయన సైకిల్ తొక్కుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన మూర్చ వ్యాధి నుంచి పూర్తిగా బయపడ్డారు.