నగరంలో దాహం.. దాహం..

|

Jun 14, 2019 | 1:24 PM

తాగునీరు దొరకక హైదరాబాద్ నగర వాసులు అల్లాడుతున్నారు. సగం మున్సిపాలిటీల్లో 3 రోజులకొకసారి నీటి సరఫరా అందిస్తున్నారు. ఇక చాలా ప్రాంతాల్లో ట్యాంకర్లే దిక్కు.. అవి కూడా అరకొరగా ఉండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ ట్యాంకర్ యజమానులు ఇష్టారీతిలో దోచుకుంటున్నారు. ఒక్కో ట్యాంకర్‌కు రూ. 4000 నుంచి 5000 వసూలు చేస్తున్నారు. ఓ వైపు ఎండలు మండిపోతుంటే.. మరోవైపు తాగునీటి వెతలు కొనసాగుతున్నాయి. జలాశయాల్లో నీరు సమృద్ధిగా లేకపోవడం, […]

నగరంలో దాహం.. దాహం..
Follow us on

తాగునీరు దొరకక హైదరాబాద్ నగర వాసులు అల్లాడుతున్నారు. సగం మున్సిపాలిటీల్లో 3 రోజులకొకసారి నీటి సరఫరా అందిస్తున్నారు. ఇక చాలా ప్రాంతాల్లో ట్యాంకర్లే దిక్కు.. అవి కూడా అరకొరగా ఉండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ ట్యాంకర్ యజమానులు ఇష్టారీతిలో దోచుకుంటున్నారు. ఒక్కో ట్యాంకర్‌కు రూ. 4000 నుంచి 5000 వసూలు చేస్తున్నారు. ఓ వైపు ఎండలు మండిపోతుంటే.. మరోవైపు తాగునీటి వెతలు కొనసాగుతున్నాయి. జలాశయాల్లో నీరు సమృద్ధిగా లేకపోవడం, భూగర్భ జలాలు అడుగంటడంతో తాగునీటికి తిప్పలు తప్పడం లేదు. వానలు కురవకపోతే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలోని సుమారు కోటి జనాభాకు ప్రతిరోజు కనీసం 600 మిలియన్ గ్యాలన్ల నీటి అవసరం ఉండగా, ప్రస్తుతం 450 మిలియన్ గ్యాలన్ల నీటినే సరఫరా చేస్తోంది. పలు ప్రాంతాల్లో మూడు నాలుగు రోజులకు ఒకసారి అరకొరగా సరఫరా చేస్తున్నారు. కూకట్‌పల్లి, రాజేంద్రనగర్‌ ప్రాంతాల్లో ప్రజలు అల్లాడుతున్నారు. హైటెక్‌ సిటీ, కేపీహెచ్‌బీ, నిజాంపేట, మాదాపూర్‌, కొండాపూర్‌, యూస్‌ఫగూడ, సనత్‌నగర్‌, కంటోన్మెంట్‌, సికింద్రాబాద్‌, శ్రీనగర్‌ కాలనీ, బేగంపేట తదితర ప్రాంతాల్లో లో ఫ్రెషర్‌గా వచ్చే నీరు సరిపోవడం లేదు. రెండు రోజులకు రావాల్సిన నీళ్లు ఒక్క రోజుకు సరిపడేలా కూడా రావడం లేదు. ట్యాంకర్‌ బుక్‌ చేసినా రావడానికి వారం పడుతోంది. దీంతో, ప్రైవేటు ట్యాంకర్లను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వాటి ధర ఇప్పుడు ఏకంగా ఎనిమిది రెట్లు పెరిగింది. కేపీహెచ్‌బీ కాలనీ, భాగ్యనగర్‌కాలనీ పరిసర ప్రాంతాల్లో నీటి కోసం స్థానికులు పగలు, రాత్రి పడిగాపులు కాస్తున్నారు.