Telangana: ఆదాయం పెంచే మార్గాలను కనిపెట్టండి.. మంత్రులతో డిప్యూటీ సీఎం

| Edited By: Narender Vaitla

Jun 07, 2024 | 8:51 PM

సమీక్షలో భాగంగా గత రెండు ఆర్థిక సంవత్సరాల ప్రగతిని సమీక్షించారు. ఆ తర్వాత బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు నెలలు కనబరిచిన పనితీరును సమీక్షించి ఆయా శాఖల్లో పనితీరు మెరుగుపరచుకోవడానికి యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుని ఏటువంటి లీకేజీలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని...

Telangana: ఆదాయం పెంచే మార్గాలను కనిపెట్టండి.. మంత్రులతో డిప్యూటీ సీఎం
Mallu Bhatti Vikramarka
Follow us on

రాష్ట్రంలో ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో వివిధ శాఖల సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఆర్థిక, రెవెన్యూ, ఎక్సైజ్, రవాణా, ఆరోగ్యశ్రీ విభాగాల పనితీరును సమీక్షించారు. ఈ సమావేశంలో రెవిన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

సమీక్షలో భాగంగా గత రెండు ఆర్థిక సంవత్సరాల ప్రగతిని సమీక్షించారు. ఆ తర్వాత బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు నెలలు కనబరిచిన పనితీరును సమీక్షించి ఆయా శాఖల్లో పనితీరు మెరుగుపరచుకోవడానికి యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుని ఏటువంటి లీకేజీలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఎన్ఫోర్స్ మెంట్ విభాగాన్ని పటిష్టపరిచి బడ్జెట్ అంచనాలను అందుకోవాలని వివరించారు.

ఆదాయం పెంచుకునేందుకు వాణిజ్య పన్నుల శాఖలో వేసిన కమిటీ పనితీరును డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. ఆదాయం పెంచుకునేందుకు కమర్షియల్ టాక్స్ విభాగాల్లో తరచూ సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఆర్టీసీ ప్రస్తుతం వివిధ బ్యాంకులు, సంస్థలకు చెల్లిస్తున్న రుణాల వడ్డీ రేటును సమీక్ష చేసుకొని, తక్కువ వడ్డీ రేటు ఇచ్చే సంస్థలకు రుణాలు బదలాయింపు చేసుకుని ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.

ఇటీవల సింగరేణిలో చేసిన ఈ ప్రయోగం ద్వారా వందల కోట్ల ప్రయోజనం చేకూరిన విషయాన్ని ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులకు వివరించారు. LRS దరఖాస్తులు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి, ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ఈ ప్రక్రియ ప్రారంభమైన ప్రగతి లేకపోవడానికి కారణాలు డిప్యూటీ సీఎం సమీక్షించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి ఖజానాకు అదనపు ఆదాయం సమకూర్చాలని కోరారు. పూర్తిగా అర్హత ఉన్న స్థలాలకే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (LRS) అమలు చేయాలని, ప్రభుత్వ భూములు కబ్జా చేసి ఈ పథకం కింద ప్రయోజనం పొందే ప్రమాదం పొంచి ఉందని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు.

హౌసింగ్ బోర్డ్, రాజీవ్ స్వగృహ పథకాల ద్వారా నిర్మించిన ఇల్లు, వచ్చిన ఆదాయం వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికీ విక్రయించని ఇల్లు, ఇళ్ల స్థలాలు వాటి పరిస్థితిని సమీక్షించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా సామాన్యుడు సంతృప్తి చెందడమే ప్రధాన లక్ష్యమని అధికారులకు సూచించారు. ఆరోగ్యశ్రీ బకాయిలను నెలవారి చెల్లించే పద్ధతిని ఆచరణలో పెడుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అమలు చేస్తున్న ప్యాకేజీల ధరలకే ప్రైవేటు ఆసుపత్రిలో ఆయా చికిత్సలు అందించేందుకు వారిని ఒప్పించాలని, ఈ పథకం సామాజిక బాధ్యతలో భాగమని వారికి వివరించాలని, వారితో చర్చలు జరపాలని డిప్యూటీ సీఎం అధికారులను కోరారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, కమర్షియల్ టాక్స్ కమిషనర్ శ్రీదేవి, రవాణా శాఖ కమిషనర్ బుద్ధ ప్రసాద్, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రెటరీ హరిత, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..