తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్ర బడ్జెట్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతో పాటు పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా రాష్ట్రానికి ఆదాయం సంపాదించే మార్గాల మీద చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ నెల 24 నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేసేందుకు.. ఈ నెల 18న ప్రగతి భవన్ లో రాష్ట్ర స్థాయి మున్సిపల్ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు ఎమ్మెల్యేలు, మేయర్లు, కలెక్టర్లను ఆహ్వానించనున్నారు. ఆదివారం సాయత్రం ప్రగతి భవన్లో సీఎం కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం 6 గంటలపాటు సుదీర్ఘంగా కొనసాగింది. పట్టణ ప్రగతి నిర్వహణపై కేబినెట్ భేటీ లో విస్తృత చర్చ జరిగింది.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో చక్కని నగర జీవన వ్యవస్థపై పయనం సాగడమే లక్ష్యమన్నారు. ఇందుకు పట్టణ ప్రగతి కార్యక్రమంతో మంచి పునాది ఏర్పడాలన్నారు. పట్టణాల్లో పచ్చదనం-పారిశుధ్యం వెల్లివిరియాలన్నారు. ప్రణాళికాబద్ధమైన ప్రగతి జరగాలని.. పౌరులకు మెరుగైన సేవలు అందాలన్నారు. పట్టణ ప్రగతి ద్వారా ప్రజలందరి విస్తృత భాగస్వామ్యంతో విజయవంతం చేయాలన్నారు. పట్టణాభివృద్ధికి ప్రణాళిక వేసుకుని అందుకు అనుగుణంగా నిధులు వినియోగించుకుని క్రమపద్ధతిలో ప్రగతి సాధించాలని సీఎం కేసీఆర్ కేబినెట్ భేటీ లో మంత్రులకు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు