సీఎం కేసీఆర్ తెలంగాణను ఓ రాష్ట్రం కాకుండా రాజ్యమనుకున్నారని… రాష్ట్రంలో కుటుంబ పాలన చేస్తున్నారని… అందుకే లోక్సభ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారని మల్కాజ్గిరి ఎంపీగా గెలుపొందిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును బాధ్యతగా భావిస్తున్నట్టు చెప్పారు. నియోజకవర్గంలోని సమస్యల్ని పరిష్కరించడమే తన తొలి ప్రాధాన్యమని రేవంత్ స్పష్టం చేశారు.
తెలంగాణ సమస్యలపై పార్లమెంట్లో గళమెత్తేందుకు తనను గెలిపించారని.. విభజన హామీల అమలుతో పాటు తెలంగాణకు రావాల్సిన జాతీయ ప్రాజెక్టులు.. రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, ఉక్కు కర్మాగారం తదితర అంశాలపై తాను పార్లమెంట్లో గళం వినిపిస్తానని రేవంత్ వివరించారు. తనను ఆశీర్వదించి గెలిపించిన మల్కాజ్గిరి ప్రజలకు రుణపడి ఉంటానన్నారు.