పోడు పట్టాల సమస్యలను త్వరగా పరిష్కరించాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. సత్వరం క్షేత్రస్థాయిలో పర్యటించి పెండింగ్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. అర్హులకు పోడు పట్టాలివ్వాలని.. పట్టాలిచ్చేందుకు అర్హత సాధించని వారికి కారణాలు చెప్పి దరఖాస్తులను క్లియర్ చేసి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు.
పోడు పట్టాల సమస్యలు, పోడు భూముల సమస్యల పై మంత్రులు కొండా సురేఖ, సీతక్క సచివాలయంలో శనివారం రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఏజేన్సీ ప్రాంత ఎంఎల్ఏలు, పలువురు మైదాన ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బిజెపి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్, అటవీ శాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్లు, డీఎఫ్ఓ లు, ఐటిడిఏ పీఓలు పాల్గొన్నారు. పోడు పట్టాల కోసం పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరగా క్లియర్ చేసే విధి విధానాల పై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీతక్క..అటవీ శాఖ, గిరిజన శాఖ మరింత సమన్వయంతో పనిచేసి పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
పోడు పట్టాల కోసం దరఖాస్తుదారులను పదే పదే తిప్పుకోవడం సరికాదని చెప్పారు. పోడు పట్టాలు ఇచ్చేందుకు అర్హత లేకపోతే అదే విషయాన్ని దరఖాస్తుదారులకు వివరించాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్టీలు, అటవీ శాఖ సిబ్బంది మధ్య ఘర్షణ వాతావరణాన్ని నివారించేలా చర్యలు చేపట్టాలన్నారు. కొత్తగా అడవులు నరకకుండా ప్రజలకు అవగాహన పెంచాలన్నారు. అడవుల్లో పండ్ల మొక్కలను పెంచి స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచడం ద్వారా.. అడవుల అందరికీ వేతనం నివారించవచ్చు అన్నారు. అడవుల నరికివేతకు అడవి బిడ్డలే కారణమన్న అభిప్రాయాన్ని మార్చుకోవాలన్నారు.
అడవి బిడ్డలున్న చోటే అడవులు భద్రంగా ఉన్నాయన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించాలని కోరారు. ఏజెన్సీ ఏరియాలో రహదారుల నిర్మాణానికి, విద్యుత్ లైన్లను, మౌలిక వసతుల కల్పనకు, కేంద్ర నిబంధనలు ఆటకంగా మారాయని, అడవులను కాపాడుకుంటూనే ఆదివాసి గిరిజనుల అభివృద్ధిని ఆకాంక్షించేలా నిబంధనలను సడలించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో పెండింగ్ పోడు దరఖాస్తులను క్లియర్ చేసేలా విధివిధానాలు ఖరారు చేశారు. కలెక్టర్ నేతృత్వంలో అటవి శాఖ, గిరిజన శాఖ స్థానిక ప్రజలు తో అటవీ హక్కుల కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కమిటీల సిఫార్సులకు అనుగుణంగా కొత్తగా పోడు పట్టాలు మంజూరు చేయనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..