నవీన్- రేణుక… ఇద్దరివీ మూడక్షారాల పేర్లు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేలాంటి చూడచక్కని జంట. పెద్దలు కుదుర్చిన సంబంధం. పెళ్లయి ఇంకా ఏడాది కాలేదు. అతనిది మహబూబ్నగర్ జిల్లాలోని చింతకుంట. రేణుక పేరెంట్స్ది మద్దురు. కొత్తగా పెళ్లయింది కదా. తరుచూ పుట్టింటికి వెళ్లి వస్తుండేది. ఆమె కోసం అతనూ అత్తారింటికి వెళ్తుండేవాడు. మొదట్లో అంతా ఆల్ హ్యాపీస్. కానీ పది నెలలైందో లేదో నవీన్ చెరువులో శవమయ్యాడు. కోడలే తమ కొడుకును చంపించిందిని ఆరోపించారు నవీన్ తండ్రి. కల్యాణ్ లక్ష్మి డబ్బు కోసం పైరవీకోరులతో వివాహేతర సంబంధాలు పెట్టుకొని ఇంత ఘాతుకానికి ఒడిగొట్టారని వాపోయారు కుటుంబసభ్యులు. క్రైమ్ కథా చిత్రమ్లో కల్యాణ లక్ష్మి స్కీమ్ ఎంటరయ్యింది. బంగారు తల్లి పెళ్లి కోసమని ప్రభుత్వం సదుద్దేశంతో అందిస్తోన్న పథకం చాటున ఇలాంటి కుతంత్రాలు జరుగుతున్నాయా? కల్యాణ లక్ష్మీ డబ్బు కోసమే పతి హత్యకు పథకం పన్నారా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ చింతకుంట గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
స్థానికుల ఆందోళన… నవీన్ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. నిజానిజాలు తేల్చి . బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి. నవీన్ అనుమానాస్పద మృతి కేసులో నిజానిజాలేంటో ఇక దర్యాప్తులో తేలాలి. కానీ బంధువుల ఆరోపణలతో కల్యాణ లక్ష్మీ మాటున పైరవీకోరు ఆగడాలపై ఈ స్థాయిలో వున్నాయా? ఆనే ఆందోళన వ్యక్తమవుతోంది.
బంగారు తల్లుల కోసం ప్రభుత్వం సదుద్దేశంతో చేపట్టిన కల్యాణ లక్ష్మీ పథం ఎందరో జీవితాల్లో వెలుగులు నింపింది. కానీ పైరవీ వ్యవస్థ ప్రభుత్వ పథకాల ఉద్దేశాలకు తూట్లు పడుస్తోందనడానికి ఈ ఘటనే ఓ నిదర్శనం. ఇలాంటి అక్రమాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిది. చింతపల్లి గ్రామస్తులు చెప్పినట్టుగా ఎక్కడైనా ఇలాంటి పైరవీలు జరుగుతున్నట్టు తెలిస్తే వెంటనే సంబంధిత అధికారులకు, పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ప్రభుత్వ పథకాలను పొందే హక్కుతో పాటు అక్రమాలను అరికట్టాల్సిన బాధ్యత అందరిదీ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..