Mahabubnagar: ముగిసిన MLC ఉప ఎన్నిక పోలింగ్.. గెలుపు‌పై కాంగ్రెస్ ధీమా..

|

Mar 28, 2024 | 8:05 PM

పోలింగ్‌ ముగిసింది.. ఫలితం మిగిలింది.! అయితే క్రాస్ ఓటింగ్‌ భయం.. ప్రతిపక్ష పార్టీని కంగారు పెడుతోంది. ఖచ్చితంగా గెలవాల్సిన స్థానమే అయినా కూడా.. పార్టీ నేతలు హస్తంతో టచ్‌లో ఉండడం బీఆర్‌ఎస్‌ను భయపెడుతుంది. మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ఓడిపోతే కారుపార్టీకి మరో షాక్ తగిలినట్లే.

Mahabubnagar: ముగిసిన MLC ఉప ఎన్నిక పోలింగ్.. గెలుపు‌పై కాంగ్రెస్ ధీమా..
Follow us on

పోలింగ్‌ ముగిసింది.. ఫలితం మిగిలింది.! అయితే క్రాస్ ఓటింగ్‌ భయం.. ప్రతిపక్ష పార్టీని కంగారు పెడుతోంది. ఖచ్చితంగా గెలవాల్సిన స్థానమే అయినా కూడా.. పార్టీ నేతలు హస్తంతో టచ్‌లో ఉండడం బీఆర్‌ఎస్‌ను భయపెడుతుంది. మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ఓడిపోతే కారుపార్టీకి మరో షాక్ తగిలినట్లే.

కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మహబూబ్​నగర్ లోకల్​ బాడీస్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో..భారీగా పోలింగ్ నమోదయింది. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ నుంచి మన్నె జీవన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నుంచి నవీన్‌కుమార్‌రెడ్డి బరిలో నిలిచారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఎన్నికలో గెలిచి కేడర్​లో జోష్​ నింపేందుకు అధికార పార్టీ.. సిట్టింగ్ ​స్థానాన్ని చేజార్చుకోకూడదని బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేశాయి. దీంతో ఉప ఎన్నికల్లో 99.86% పోలింగ్ నమోదయింది. మొత్తం 1439 ఓట్లకు గాను 1437ఓట్లు పోలయ్యాయి. సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్‌లోని ఎంపీడీవో కార్యాలయంలో ఓటు వేశారు. మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

గెలుపును రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో..ప్రజా ప్రతినిధులను క్యాంప్‌లకు తరలించాయి. వారంతా క్యాంపుల నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేశారు. అయితే ఈ ఎన్నికలో భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి 1439 మంది ఓటర్లలో 900 మంది బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులే. కానీ వారిలో చాలా మంది ఇప్పటికే హస్తం గూటికి చేరారు. ఇంకొందరు కాంగ్రెస్‌కు టచ్‌లో ఉన్నట్లు సమాచారం. దీంతో వారిని ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ క్యాంపులకు తరలించింది. అయినా కూడా వారిలో చాలామంది క్రాస్‌ ఓటింగ్‌ చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు పోలింగ్‌లో కొన్నిచోట్ల రెండు పార్టీల నేతల మధ్య వాగ్వాదాలు జరిగాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి పోలింగ్‌ కేంద్రంలో చాలాసేపు ఉండిపోవడంతో పోలీసులు అభ్యంతరం చెప్పారు. ఓటు వేసేందుకు వేచి ఉంటే తప్పేంటి అంటూ సీఐ భీంకుమార్ తో వాగ్వాదానికి దిగారు ఎమ్మెల్యే. ఈ పరిణామంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ తపన పడగా.. అధికార కాంగ్రెస్ ఆ స్థానాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేసింది. మరి ఏ పార్టీ వ్యూహాలు ఫలిస్తాయో తెలియాలంటే ఏప్రిల్ 2న కౌంటింగ్‌ వరకూ ఎదురుచూడాల్సిందే.