20 ఏళ్లుగా పూజలకు నోచుకోని ఆలయం.. ఏదో అదృశ్య శక్తి ఉందని ప్రచారం..

| Edited By: Srikar T

Jul 14, 2024 | 9:03 AM

గుళ్లో ఏముంటుంది.? ఈ ప్రశ్నకు ఎవర్నుంచైనా.. దేవుడనే సమాధానమే వస్తుంది. కానీ, ఆ గుళ్లో మాత్రం ఏముంటుందో తెలిస్తే.. మీరు అవాక్కవుతారు. ఆ అంధవిశ్వాసమే.. గుడికి ఎవ్వరినీ పోకుండా చేసేసింది. మరి భక్తుడికి, భగవంతుడికి అనుసంధానమైన పూజారి మరణంతో ఆ గుళ్లో ఏం జరిగింది.? ఎందుకోసం గుడిలోకి భక్తులు వెళ్లడం లేదు.. ఇప్పుడు తెలుసుకుందాం. ఆది వేణుగోపాలస్వామి ఆలయం.

20 ఏళ్లుగా పూజలకు నోచుకోని ఆలయం.. ఏదో అదృశ్య శక్తి ఉందని ప్రచారం..
Karimnagar
Follow us on

గుళ్లో ఏముంటుంది.? ఈ ప్రశ్నకు ఎవర్నుంచైనా.. దేవుడనే సమాధానమే వస్తుంది. కానీ, ఆ గుళ్లో మాత్రం ఏముంటుందో తెలిస్తే.. మీరు అవాక్కవుతారు. ఆ అంధవిశ్వాసమే.. గుడికి ఎవ్వరినీ పోకుండా చేసేసింది. మరి భక్తుడికి, భగవంతుడికి అనుసంధానమైన పూజారి మరణంతో ఆ గుళ్లో ఏం జరిగింది.? ఎందుకోసం గుడిలోకి భక్తులు వెళ్లడం లేదు.. ఇప్పుడు తెలుసుకుందాం. ఆది వేణుగోపాలస్వామి ఆలయం. చొప్పదండి మండలం ఆర్నకొండలో ఉన్న ఈ ఆలయ చరిత్ర 150 ఏళ్ల నాటిది. అయితే, గత 20 ఏళ్ల నుంచి ఇక్కడి దేవుడు పూజలకు నోచుకోవడం లేదు. ఓ పూజారి మరణంతో.. ఈ గుళ్లో దేవుడు కాకుండా ఏదో అదృశ్య శక్తి ఉందని భక్తులు భావిస్తున్నారు. ఈ ఆలయంలో వేణుగోపాల స్వామితో పాటు.. కాళికా మాత విగ్రహాన్ని పూజారి ప్రతిష్ట చేశారు. కాళికా మాతకు ప్రత్యేక పూజలు చేసేవారు. అమ్మవారి ఉపాసన చేస్తూ ఉండే వారు హనుమంతు పంతులు. గుళ్లో నిత్య దీపారాధన చేస్తూనే.. భూత, ప్రేత, పిశాచాలు ఆవహించినవారికి, ఇతర మానసిక రోగులకు తనకు తెలిసిన పద్ధతుల్లో చికిత్స చేస్తూ ఉండేవారు. ఈ విషయం నలుదిశలకూ వ్యాపించి.. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ఇక్కడకు అనేక మంది భక్తులు వచ్చే వారు. దీంతో ఓ పెద్ద క్యూనే కనిపించేది. వారిచ్చే కానుకలతోనే ఈ ఆలయాన్ని హనుమంతు అనే పూజారి అభివృద్ధి చేశాడనేది స్థానికులు చెప్పే మాట. కానీ, 20 ఏళ్ల క్రితం హనుమంతు మరణంతో.. గుడి మూగబోయింది. అప్పటివరకూ పెద్దఎత్తున భక్తులు, భూత, ప్రేత, పిశాచాలావహించినవారికి వైద్యమందించడంతో కళకళలాడిన గుళ్లో.. దెయ్యం పట్టిందనే భావన స్థానికుల్లో నెలకొంది. దీంతో ఆ ఆలయంపై అపఖ్యాతి నలుదిక్కులకూ పాకింది.

ఇప్పుడు ఆ గుడివైపు చూసేందుకు ఆసక్తి చూపకపోగా పట్టపగలు ఆ గుడిపైపు నడుచుకుంటూ వెళ్లాలంటే కూడా స్థానికులు భయపడుతున్నారు. అయితే.. ఈ పూజారి కాళికా మాతకు గంటల కొద్దీ పూజలు నిర్వహించే వారని చెబుతుననారు. ప్రతి రోజు అమ్మవారికి అభిషేకం, ఇతర పూజలు నిర్వహించే వారని స్థానికులు తెలిపారు. కాళికా మాతకు పూజలు చేయడం నిల్పివేయడంతో ఆ గ్రామంలో ఏదో జరుగుతుందనే భావన స్థానికుల్లో ఉంది. అంతేకాదు..ఏదో శక్తి ఉందనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. గతంలో భక్తులు అడుగు పెడితే ఏదో శబ్దం వచ్చిందనే ప్రచారం కూడా ఉంది. దీంతో గత 20 ఏళ్లుగా భక్తులు అడుగు పెట్టడం లేదు. పురాతన ఆలయం.. ఇప్పుడు కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఎటు చుసిన పిచ్చి మొక్కలు మొలిసిన దృశ్యాలు కనబడుతున్నాయి. ఆలయ రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. అయితే, ప్రస్తుతం కరీంనగర్ శివార్లలోని తీగలగుట్టపల్లికి చెందిన ఓ పూజారి రెండు, మూడు నెలలకోసారి వచ్చి దీపారాధన చేసి పోతున్నారు. ప్రస్తుతం ధూప, దీప నైవేద్యాలు చూస్తున్న పూజారి ఆరోగ్యం కూడా క్షీణించడంతో స్థానికులు భయపడుతున్నారు. రాక్షసులను చెండాడిన కాళికామాతతో పాటు.. అభయాంజనేయుడు కొలువై ఉన్న ఈ గుళ్లోకి వెళ్లేందుకు ఇప్పుడు జనం జంకుతున్నారు. ప్రపంచం వ్యాప్తంగా శాస్త్ర, విజ్ఞానం వైపు అడుగులేస్తుంటే.. దేవుడున్న గుళ్లో ఏదో ఉందనుకుంటూ జనం భయపడిపోతున్నారు. ఇలాంటి మూఢ నమ్మకాలకు చెక్ పెట్టి ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు. మళ్ళీ ఈ గుడిలో పూజలు నిర్వహించాలని కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..