TPCC: అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy), తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్( Manickam Tagore)పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. మొన్న జరిగిన సమావేశానికి కోమటిరెడ్డి హాజరుకాకపోవడంతో ప్రత్యేకంగా ఇవాళ ఆయనను పిలిపించి ప్రియాంక మాట్లాడారు. దాదాపు 40 నిమిషాల సేపు అనేక విషయాలపై తమ మధ్య చర్చ జరిగిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకొస్తున్నాయనే విషయాన్ని కూడా ప్రియాంక గాంధీ ప్రస్తావించారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సమావేశంలో ఏం చర్చించారు, ఏం నిర్ణయాలు తీసుకున్నారనేది తాను చెప్పనుగాక చెప్పనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వాటికి సంబంధించి తనను ఎటువంటి ప్రశ్నలు అడగొద్దని ఆయన పదేపదే కోరారు. మునుగోడు ఉపఎన్నికలో ప్రచారానికి వెళ్తారా లేదా అన్న ప్రశ్నకు కూడా సమాధానం చెప్పేందుకు ఆయన నిరాకరించారు. చర్చలు అయితే ఫ్రూట్ఫుల్గా సాగాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. మరి రేవంత్, మాణిక్కం ఠాగూర్పై విరుచుకుపడుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజా భేటీతో సైలెన్స్ అవుతారా? ప్రియాంక గాంధీ ఇచ్చిన సూచనలు పాటిస్తారా? ఏం జరుగుతుందో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం