తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బడ్జెట్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడిన తరువాత ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీతో కాంగ్రెస్ ఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి అక్బరుద్దీన్ ఓవైసీతో మాట్లాడారు. అరగంటకుపైగా వాళ్ల మధ్య ఏం చర్చ జరిగిందన్న దానిపై ఆసక్తి నెలకొంది.
అసెంబ్లీ సమావేశాల్లో అక్బరుద్దీన్ ప్రభుత్వంపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తామన్న ప్రభుత్వ హామీ ఏమైందని ప్రశ్నించారు. నిజానికి బీఆర్ఎస్-ఎంఐఎం మిత్రపక్షాలు. అయితే ఆల్ ఆఫ్ సడెన్గా సర్కార్ను చెడుగుడు ఆడటం అందర్నీ ఆలోచనలో పడేసింది. అంతలోనే హస్తం నేతలతో అక్బరుద్దీన్ మాటామంతీ మరింత కాక పుట్టించింది.
అక్బరుద్దీన్తో ఏం మాట్లాడారన్న దానిపై ముగ్గురు నేతలు భిన్నంగా స్పందించారు. పిచ్చాపాటిగా మాట్లాడుకున్నామే తప్ప ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని ఒక్క మాటలో తేల్చేశారు భట్టి విక్రమార్క. మరోవైపు కలిసి పనిచేస్తామన్న చర్చే జరగలేదన్నారు శ్రీధర్ బాబు. జగ్గారెడ్డి మాత్రం కాస్త ఓపెన్ అయినట్టు కనిపించింది. పాత మిత్రులం పైగా ఇద్దరి టార్గెట్ ఒకటే. అలాగని అన్ని విషయాలు బయటకు చెప్పలేమని దాటవేశారు. మొన్నటిదాకా ఉప్పు నిప్పులా ఉండే నేతలు.. సడెన్గా కలిసి మాట్లాడుకున్నారు. దీంతో పొలిటికల్ సర్కిల్స్లో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం