ఆరోగ్య శాఖ మాజీ డైరక్టర్ తన మనసులోని మాట వెల్లడించారు. ఇంతకాలం నర్మగర్భంగా వ్యవహరించిన ఆయన తన పయనమిక రాజకీయాల్లోనే అంటూ కుండబద్దలు కొట్టారు. తనకు ప్రజా క్షేత్రంలోనే ఇక తన జీవితం కొనసాగబోతుందని ప్రకటించారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్నూరు కాపు సత్రం 11వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 25 ఏళ్ల తన ఉద్యోగ జీవితానికి రాజీనామా చేస్తున్నానని, ప్రజా జీవితంలోకి రావాలని నిశ్చయించుకున్నానన్నారు. సికింద్రాబాద్, ఖమ్మం లోకసభ స్థానాల నుండి తనకు టికెట్ ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేసుకున్నానని కూడా గడల శ్రీనివాస్ ప్రకటించడం గమనార్హం. ప్రజాస్వామ్య వాతావరణం కాంగ్రెస్ పార్టీలోనే ఉందని దరఖాస్తులు తీసుకుని అర్హులైన వారికి టికెట్లు ఇచ్చే సంస్కృతి కొనసాగడమే ఇందుకు నిదర్శనమన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీపై భారీ ఆశలు పెట్టుకున్న గడల శ్రీనివాస రావు కేసీఆర్ను ఆకాశానికి ఎత్తుకున్నారు. ఆయనకు పాదాభివందనం చేసిన విషయంలో కూడా ఘాటుగానే స్పందించిన ఆయన వంద సార్లు అయినా మొక్కుతా అంటూ బాహాటంగానే ప్రకటించారు. అప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించిన ఆయనకు బీఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించలేదు. ఎన్నికల తరువాత ప్రభుత్వం మారగానే ఆయనకు స్థాన చలనం కల్పించిన సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న గడల శ్రీనివాస రావు ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా వేములవాడ మున్నూరు కాపు సత్రం వార్షికోత్సవంలో కాంగ్రెస్ పార్టీని మెచ్చుకుంటూ వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి