Hyderabad: గంజాయికి అడ్డాగా ధూల్‌పేట్‌.. పోలీసుల స్పెషల్ ఆపరేషన్

|

Jul 28, 2024 | 1:16 PM

హైదరాబాద్‌లో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే.. గంజాయి ఎక్కడ పట్టుబడ్డా.. దాని మూలాలు ధూల్‌పేట్‌కు కనెక్ట్‌ అవుతుండడంతో అక్కడ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. గతంలో గుడుంబాకు అడ్డాగా ఉన్న ధూల్‌పేట్‌ను సమూలంగా ప్రక్షాళించిన పోలీసులు.. ఇప్పుడు.. గంజాయి నిర్మూలన కోసం.. ఆపరేషన్‌ గంజాయి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంతకీ.. ధూల్‌పేట్‌.. గంజాయికి అడ్డాగా ఎందుకు మారింది?..

Hyderabad: గంజాయికి అడ్డాగా ధూల్‌పేట్‌.. పోలీసుల స్పెషల్ ఆపరేషన్
Ganja
Follow us on

ధూల్‌పేట్.. ఒకప్పుడు హైదరాబాద్ ఓల్డ్‌సిటీలో గుడుంబా తయారీకి కేరాఫ్‌ అడ్రస్‌. కానీ.. ప్రభుత్వాలు, ఎక్సైజ్ శాఖల సమన్వయంతో రూపొందించిన వ్యూహాలకు గుడుంబా తయారీ సమూలంగా తుడిచిపెట్టుకుపోయింది. అయితే.. గుడుంబాకు గుడ్‌ బై చెప్పిన కుటుంబాలు.. ఇప్పుడు గంజాయి వైపు దృష్టిపెట్టడం పోలీసులను కలవరపెడుతోంది. దాంతో.. ఒకప్పుడు ఆపరేషన్ గుడుంబా చేపట్టి విముక్తి కలిగించిన ఎక్సైజ్ శాఖ.. ఇప్పుడు ఆపరేషన్ గంజాయితో ఉక్కుపాదంమోపుతోంది. ప్రస్తుతం ధూల్‌పేట్​లోనే కాదు.. హైదరాబాద్‌ సిటీ వ్యాప్తంగా, శివారు ప్రాంతాల్లోనూ గంజాయి దందా జోరుగా కొనసాగుతోంది. అయితే.. గంజాయి, డ్రగ్స్ విషయంలో ఉక్కు పాదం మోపాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా క‌మ‌లాస‌న్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాడులు మరింత వేగవంతం చేశారు. ఈ క్రమంలో.. సిటీలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలన్నీ ధూల్‌పేట్‌లో బయటపడుతుండడంతో ప్రత్యేక దృష్టి సారించారు పోలీసులు. ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖల ఆధ్వర్యంలో ఆపరేషన్ ధూల్‌పేట్ పేరుతో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. గతంలో గంజాయి స్మగ్లింగ్ చేసి పట్టుబడ్డవారితోపాటు.. పెడ్లర్స్, కన్సూమర్స్‌పై ఫోకస్‌ పెట్టి.. ఇంటింటికి, గల్లీగల్లీ తిరుగుతూ తనిఖీలు చేస్తున్నారు. దాంతో.. ధూల్‌పేట్‌ కేంద్రంగా చేపట్టిన మెరుపు దాడుల్లో కిలోల కొద్దీ గంజాయి పట్టుబడుతోంది.

ఇక… ఆగస్టు 31లోపు ధూల్‌పేట్‌ను గంజాయి రహిత ప్రాంతంగా మారుస్తామన్నారు తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌ క‌మ‌లాస‌న్‌రెడ్డి. ధూల్‌పేట్‌తోపాటు.. హైదరాబాద్‌ సిటీలోని అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు.

మరోవైపు.. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి రవాణా అవుతుండడంతో దాన్ని అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టారు పోలీసులు. ఏపీ, ఒడిశా, కర్నాటక, మహారాష్ట్ర నుంచి రాకపోకలు సాగించే రైళ్లలోనూ తనిఖీలు ముమ్మరం చేశారు. తాజాగా.. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు చేసిన పోలీసులు.. గంజాయి స్మగ్లింగ్‌లో కీలక నిందితుడైన రాహుల్‌సింగ్‌ను అరెస్ట్ చేశారు. మొత్తంగా.. మెరుపు దాడులతో హైదరాబాద్‌లో గంజాయి స్మగ్లర్స్‌కు వణుకుపుట్టిస్తున్నారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..