సజ్జనార్.. ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడినవారిని క్షమించడం అనేది ఆయన డిక్షనరీలో ఉండదు. గతంలో వరంగల్లో పని చేసినప్పుడు గానీ.. ఇప్పుడు హైదరాబాద్ డాక్టర్ దిశ విషయంలో గానీ సజ్జనార్ నిందితులను ఎన్కౌంటర్ చేసి.. మరోసారి ఇలాంటి అమానుష ఘటనలు పాల్పడేవారికి వెన్నులో వణుకు వచ్చేలా చేశారని చెప్పాలి.
ఇదిలా ఉంటే దిశ కేసులోని నలుగురు నిందితులను ఇవాళ తెల్లవారు జామున పోలీసులు చటాన్పల్లి బ్రిడ్జ్ దగ్గర ఎన్కౌంటర్లో కాల్చి చంపారు. మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు.. దిశ మరణించిన ప్రదేశంలో పోలీసులు ఎన్కౌంటర్ చేయడంతో దేశవ్యాప్తంగా హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక తెలంగాణ ప్రభుత్వం, టీఎస్ పోలీసులు దిశకు తగిన న్యాయం చేసినందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఇక ఈ ఎన్కౌంటర్లో కీలక పాత్ర పోషించిన సీపీ సజ్జనార్ ఇప్పుడు మహిళలకు రియల్ హీరో అయిపోయారు. ఒక్క ఈ విషయంలోనే కాదు.. గతంలో ఆయన పని చేసిన చోట్లలో కూడా ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 9 రోజులు దిశ కేసు విచారణ చేపట్టి.. మోనిటరింగ్ చేసిన ఆయన.. 2008లో వరంగల్లో జరిగిన స్వప్నిక, ప్రణీత ఇన్సిడెంట్లో కూడా ఇదే విధంగా నిందితులను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేశారు. అప్పట్లో అది ఒక సంచలనం.
మరోవైపు మెదక్ సంఘటన గురించి ప్రస్తావిస్తే.. ఆ జిల్లాకు ఎస్పీగా సజ్జనార్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం నాగర్ B కు చెందిన గంజాయి స్మగ్లర్ బిక్యూ పవర్ అలియాస్ బిఖ్య నాయక్ను ఎన్కౌంటర్లో కాల్చి చంపారు. అప్పట్లో బిఖ్య నాయక్, భార్య రుక్మబాయి గంజాయి ముఠాను పట్టుకొని రోడ్డు పక్కన ఉండడంతో .. కర్ణాటకలోని బార్డర్ క్రైమ్ మీటింగ్కు వెళ్తున్న సురేష్ అనే కానిస్టేబుల్ (30 మార్చి 2010) వాళ్ళను వెంబడించాడు. అయితే రుక్మ బాయి, బిఖ్య నాయక్లు కలసి కానిస్టేబుల్ సురేష్ను హత్య చేసి.. మహారాష్ట్ర పారిపోయారు. దీంతో పోలీసులకు బిఖ్య నాయక్కు పట్టుకోవాలంటే సవాలుగా మారింది. సుమారు నెల రోజులు అనగా 20 ఏప్రిల్ 2010 నాడు నిందితుడు బిఖ్య నాయక్ తిరిగి స్వగ్రామం వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ తరుణంలో నాయక్ పోలీసులపై కాల్పులు జరపగా.. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరిపి బిఖ్య నాయక్ను కాల్చి చంపారు. ఇలా పలు ఎన్కౌంటర్లలో డైనమిక్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న సజ్జనార్.. కడప జిల్లాలో పులివెందుల ఏఎస్పీతో పాటుగా కూడా పని చేసిన సమయంలో కూడా ఎన్కౌంటర్లు చేశారు.
ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యకేసులో సజ్జనార్ సైబరాబాద్ సీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ కేసును లోతుగా దర్యాప్తు కూడా చేశారు. ఘటన జరిగిన మొదటి రోజు నుంచి సజ్జనార్కు.. నిందితులను ఎన్కౌంటర్ చేయాలంటూ ప్రజలు విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన మాత్రం చట్టాలు ఉన్నాయి.. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూసుకుంటామని సర్ది చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఈ మృగాళ్లకు కేసులు, కోర్టుల విచారణలు అనవసరమని.. దిశ మరణించిన ప్రదేశంలోనే ఎన్కౌంటర్ చేయడంతో ప్రజలు సజ్జనార్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘సాహో సజ్జనార్’ అంటూ దేశవ్యాప్తంగా అనేకమంది ప్రజలు సజ్జనార్ చేసిన ఈ ఎన్కౌంటర్కు హర్షం వ్యక్తం చేస్తున్నారు.