Telangana: వేకువజామున ఇంటి ముందు అదే పనిగా అరుస్తున్న కుక్కలు.. ఏంటా అని వెళ్లి చూడగా

|

Aug 07, 2024 | 11:02 AM

వేకువజామునే ఇంటి ముందు కుక్కలు అదే పనిగా అరుస్తున్నాయి. దీంతో ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి చూశాడు. ఏం కనిపించలేదు. ఆ కుక్కలను గద్దించి... కళ్లు నలుపుకుంటూ.. వాష్ రూమ్‌కు వెళ్తుండగా....

Telangana: వేకువజామున ఇంటి ముందు అదే పనిగా అరుస్తున్న కుక్కలు.. ఏంటా అని వెళ్లి చూడగా
Dogs (Representative image)
Follow us on

అప్పుడప్పుడే పొద్దు పొడుస్తోంది. ఎప్పుడూ లేనిది ఇంటి ముందు కుక్కలు అదే పనిగా అరుస్తున్నాయి. ఏంటా అని బయటకు వెళ్లి చూడగా.. ఏం కనిపించలేదు. ఇంటి చుట్టూరా పరిశీలిస్తూ ఉండగా.. స్నానాల గది పక్కనుంచి ఓ భారీ ఆకారం కనిపించింది. అప్పుడే నిద్ర లేవడంతో.. మసక కళ్లను అదేంటో స్పష్టంగా కనిపించలేదు. కాస్త కళ్లు నులముకుని పరీక్షగా చూడగా.. గుండె ఆగినంత పనయ్యింది. ఒక్కసారిగా అరుపులు, కేకలతో ఇంట్లోకి పరిగెత్తాడు ఆ వ్యక్తి. చుట్టుపక్కల వాళ్లకు కేకలేసి విషయం చెప్పారు. ఆ భారీ ఆకారం మరేదో కాదండీ.. డేంజరస్ మొసలి. 8 నుంచి 10 అడుగుల పొడువు ఉంటుంది.. బరువు అయితే క్వింటా వరకు ఉంటుంది. అంత భారీ మొసలిని చూసేసరికి అతడి ఒళ్లు ఒక్కసారిగా షేక్ అయింది. ఈ ఘటన.. వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం జానంపేట గ్రామంలో వెలుగుచూసింది.

బాత్రూం సమీపంలో… మొసలిని చూసిన ఆ ఇంటి వ్యక్తి.. ఏం చేయాలో తెలియక పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వారు.. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, స్నేక్ సొసైటీ వారికి సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరకున్న అటవీ శాఖ సిబ్బంది.. ఆ మొసలిని తాళ్లతో బంధించారు. అనంతరం.. గ్రామానికి సమీపంలోనే ఉన్న కృష్ణా నదిలో దాన్ని వదిలిపెట్టారు. ఈ సందర్భంగా.. అటవీశాఖ అధికారిణి రాణి మాట్లాడుతూ.. భారీ వర్షాలు, వరదలకు గ్రామ సమీపంలో ఉన్న చెరువు నుంచి పొలాల్లోకి వచ్చిన మొసలి.. దారి తప్పి ఇలా జనావాసాల్లోకి వచ్చి ఉంటుందని చెప్పారు. ఇలాంటి జీవచరాలు, వన్యప్రాణులు కనిపిస్తే.. వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలన్నారు.

Crocodile

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..