జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ముందంజలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో టీఆర్ఎస్ ఉంది. మొత్తం 150 డివిజన్లకు గాను.. బీజేపీకి 92 డివిజన్లలో ఆధిక్యం లభించగా.. టీఆర్ఎస్కు 33 డివిజన్లలో ఆధిక్యం లభించింది. కాంగ్రెస్ 4 డివిజన్లలో ఆధిక్యంలో ఉండగా.. ఎంఐఎం 15 డివిజన్లలో ఆధిక్యం సాధించింది.
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఫలితాలపై బీజేపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలే నిజమవుతాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. బీజేపీపై ప్రజలు విశ్వాసంతో ఉన్నారని, బీజేపీ మేయర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. సాయంత్రానికి బీజేపీకి అనుకూలంగా తీర్పు వస్తుందని ఎమ్మెల్యే రాజాసింగ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, మొత్తం 1926 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో చాలా వరకు చెల్లని ఓట్లుగా తేలాయి. మొత్తంగా చూస్తే పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 40 శాతానికి పైగా ఓట్లు చెల్లనివిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే, సాధారణ ఓట్ల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.