తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఢిల్లీ పర్యటనలో కొత్త పీసీసీ చీఫ్తో పాటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చించిన రేవంత్ రెడ్డి.. రాజ్భవన్లో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్తో సమావేశమై కీలక అంశాలపై చర్చించారు. ఈ నెలలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ప్రభుత్వం పలు బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. దీంతో అసెంబ్లీ బడ్జెట్ సెషన్తో పాటు సభలో ప్రవేశపెట్టనున్న వివిధ బిల్లులకు సంబంధించి గవర్నర్తో సీఎం చర్చించినట్లు సమాచారం.
మరోవైపు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణతో పాటుగా టీపీసీసీ చీఫ్ నియామకం ఉంటుందని పార్టీ నేతలు చెప్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఉండవని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీ ఫామ్పై పోటీ చేసిన వారికే మంత్రిగా అవకాశం ఉంటుందని కూడా తేల్చిచెప్పారు.
మంత్రి వర్గంలో ఆరు ఖాళీలు:
మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉండగా.. నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఆ జిల్లాల వారీకి చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. మైనారిటీ కోటాలో ఎవరికి అవకాశం దక్కబోతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. మొత్తంగా మంత్రివర్గ విస్తరణలో ఎవరికి చోటు దక్కుతుందనేది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపైనా ఢిల్లీలో సుదీర్ఘ కసరత్తు జరిగింది. రెడ్డి సామాజిక వర్గానికి సీఎం పదవి ఉన్న నేపథ్యంలో.. పార్టీ పదవి బీసీలకు ఇవ్వాలని మెజారిటీ కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. ఈ క్రమంలోనే మహేష్కుమార్గౌడ్, మధుమాష్కీగౌడ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి