Etela Rajender resigns to Nampally Exhibition Society: ఇటీవల మంత్రి పదవి నుంచి బర్తరఫ్ కు గురై, భారతీయ జనతా పార్టీలో ఈటల రాజేందర్ తాజాగా మరో పదవికి రాజీనామా చేశారు. హైదరాబాద్ మహానగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ పదవికి ఈటల తన రాజీనామా సమర్పించారు. రాజీనామా పత్రాన్ని ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరీకి ఈటల పంపారు. 2014 నుంచి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్గా ఆయన కొనసాగుతున్నారు. తాజాగా జరిగిన పరిణామాలతో ఆయన తన పదవిని వదులుకున్నారు. దీంతో సొసైటీ పాలకమండలి సభ్యులు సమావేశమై ఈటల రాజీనామాను ఆమోదించే అవకాశం ఉంది. కాగా, త్వరలో నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ పదవిని మంత్రి కేటీఆర్కు ఇచ్చే యోచనలో పాలకమండలి ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా భూముల కబ్జా ఆరోపణలతో ఈటల రాజేందర్ మంత్రి పదవి బర్తరఫ్ అయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవితోపాటు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం నిన్న నేరుగా ఢిల్లీకి వెళ్లిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరిపోయారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న ఆయన వెంటనే నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.