హైదరాబాద్ నగర పర్యాటక సిగలో మరో కలికితురాయి చేరింది. అత్యాధునిక క్రూజ్ జలప్రవేశంతో హుస్సేన్సాగర్ కొత్తరూపు సంతరించుకుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో తయారు చేసిన 80 సీట్ల సామర్ధ్యం కలిగిన క్రూజ్ ను రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహమ్మద్ అలీతో కలసి రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.
హుస్సేన్ సాగర్ జలాశయం లో కొత్తగా రూపొందించిన ఆధునిక క్రూజ్ ను రెండస్తుల బోట్ అంతా కలియ తిరిగి, పరిశీలించిన శ్రీనివాస్ గౌడ్ క్రూజ్ వివరాలు అడిగి తెలుకున్నారు. హైదరాబాద్ అనగానే గుర్తుకొచ్చే హుస్సేన్ సాగర్ లో కొత్తగా ఎలక్ట్రానిక్ క్రుజర్, బోట్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఇందులో బర్త్ డే లాంటి వేడుకలు జరుపుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. దుర్గం చెరువు లో మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కూడా రెండు బోట్స్ ఏర్పాటు చేశామన్నారు.హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా టూరిజంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తరువాత విదేశీ టూరిస్ట్ ల సంఖ్య మూడింతలు పెరిగిందని మంత్రి చెప్పారు.కరోనా నేపథ్యంలో పర్యాటకుల సంఖ్య కొంత తగ్గినా.. కొన్ని రోజులుగా పర్యాటకుల తాకిడి పెరిగిందన్నారు.
సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు యాదాద్రి ఆలయం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. అక్కడ విదేశీ టూరిస్ట్ లను ఆకట్టుకుంనేందుకు మరింత అద్భుతమైన టూరిజం స్పాట్ ఏర్పాటు కాబోతుందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. రానున్న కొద్దిరోజుల్లో సోలార్, ఎలక్ట్రిక్ బోట్ లను అందుబాటులోకి తెస్తామన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల మనకు సముద్రం లా నీళ్లు ఉన్నాయి. వాటిలో కూడా టూరిజం ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. దుర్గం చెరువు లో మంత్రి కేటీఆర్ చొరవతో సస్పెన్షన్ బ్రిడ్జి ని ప్రారంభించిన తర్వాత టూరిజం ఆధ్వర్యంలో మూవింగ్ రెస్టారెంట్ ను 80 సీట్లతో సోలార్ క్రుజర్ ఏర్పాటు చేశామన్నారు.
హైదరాబాద్ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈ ఆధునిక హంగులు కలిగిన క్రూజ్ లను సాగర్ జలాశయం లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. కోవిడ్ మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా టూరిజం రంగం ఎంతో నష్టపోయిందన్నారు. సీఎం కేసీఆర్ కోవిడ్ నియంత్రణ కు తీసుకున్న చర్యల కారణంగా ఇప్పుడిప్పుడే మన రాష్ట్రంలో సాధారణ పరిస్థితి నెలకొందన్నారు.