చిట్ట‌చివ‌రి రైతుకూ రైతుబంధు సాయం అందాలి..సీఎం కేసీఆర్ కీల‌క ఆదేశాలు

|

Jul 11, 2020 | 8:23 PM

రాష్ట్రంలో 'రైతుబంధు' సాయం అందని రైతులు ఏ మూలన ఎవరున్నా వెంటనే గుర్తించి, అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ ఆర్థిక సాయం అందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

చిట్ట‌చివ‌రి రైతుకూ రైతుబంధు సాయం అందాలి..సీఎం కేసీఆర్ కీల‌క ఆదేశాలు
Follow us on

రాష్ట్రంలో ‘రైతుబంధు’ సాయం అందని రైతులు ఏ మూలన ఎవరున్నా వెంటనే గుర్తించి, అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ ఆర్థిక సాయం అందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మంత్రులు తమ జిల్లాలో, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రైతులందరికీ సాయం అందిందా? ఇంకా ఎవరైనా మిగిలిపోయారా? అనే విషయాలను వెంటనే తెలుసుకుని, అందరికీ డబ్బులు అందించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. కొంత మంది రైతులకు యాజమాన్య హక్కుల విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉండడం వల్ల రైతుబంధు సాయం అందడంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉందని… అలాంటి వారిని జిల్లా కలెక్టర్లు గుర్తించి.. సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. యాజమాన్య హక్కు గుర్తించడానికి మోకా మైనా (స్పాట్ ఎంక్వైరీ) నిర్వహించాలని పేర్కొన్నారు.

గ‌వ‌ర్న‌మెంట్ సూచించిన మేరకే రైతులు వందకు వందశాతం నియంత్రిత పద్ధతిలో ఈ వానాకాలం పంట సాగు చేస్తుండడం శుభసూచకమని పేర్కొన్నారు. ఈ ఒర‌వ‌డి భవిష్యత్తులో సాధించే గొప్ప విజయానికి నాంది అని ముఖ్య‌మంత్రి పేర్కొన్నారు. సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉత్పత్తి చేసే విత్తనాలను నిల్వ చేసేందుకు రూ.25 కోట్ల వ్యయంతో అతి పెద్ద అల్ట్రా మోడర్న్ కోల్డ్ స్టోరేజి నిర్మించనున్నట్లు ప్ర‌క‌టించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో రైతువేదికల నిర్మాణం దసరా నాటికి పూర్తి చేయాలని అధికారుల‌కు సూచించారు. రైతుబంధు సాయం, ఇతర వ్యవసాయ అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్ లో రివ్యూ మీటింగ్ నిర్వ‌హించారు. ఈ సమావేశంలో ప‌లువురు మంత్రులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.