Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో ఫిబ్రవరి 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో 1 నుంచే తరగతులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన సూచన మేరకు ఓయూ పోస్టు గ్రాడ్యుయేట్ ఫైనలియర్ విద్యార్థులకు ఇకపై తరగతులు నిర్వహించేందుకు సన్నద్దమవుతోంది. కోవిడ్ -19 నిబంధనలను పక్కగా అమలు చేస్తూ ల్యాబ్, ప్రాజెక్టు వర్కులు, ఇతర తరగతులను నిర్వహించడానికి వర్సిటీ అధ్యాపకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో కొన్ని నెలలుగా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
అయితే పేద విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులకు కావాల్సిన ల్యాబ్టాప్లు, ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. పీహెచ్డీ విద్యార్థుల పరిశోధనలకూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో తరగతుల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే వర్సిటీలోని పలు కాలేజీ ప్రిన్సిపాళ్లు, డైరెక్టర్లు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే హాస్టల్ నిర్వహణపైనే వర్సిటీ అధికారులు సందిగ్ధంలో పడ్డారు. ఇప్పటి వరకు ఓయూలో హాస్టళ్లు ప్రారంభించాలని ఎలాంటి ఆదేశాలు రాలేదు. మరోవైపు లాక్డౌన్ తర్వాత దేశంలోనే తొలిసారిగా విద్యార్థులను వర్సిటీలోకి అనుమతించి వివిధ ల్యాబ్లను, పలు తరగతులను హెచ్యూ నిర్వహిస్తోంది.
Also Read: Prime Minister: భారతీయ జనౌషధి పరియోజనపై పీఎం సమీక్ష… తెలంగాణ ప్రాజెక్టుల పురోగతిపై ప్రశంస