ఇవి కేవలం డ్రోన్లు మాత్రమే కాదు..అవయవదానానికి వాహకాలు

|

May 01, 2019 | 6:02 PM

ఈ మధ్య కాలంలో అవయవదానం పట్ల అవగాహన బాగా పెరిగింది. బ్రెయిన్ డెడ్ అయినవాళ్లు, ప్రమాదాల్లో మృతి చెందిన వారి అవయవాలను డోనేట్ చేసేందుకు వారి కుటుంబ సభ్యులు ముందుకు వస్తున్నారు.  మనిషి మరణించాక కూడా.. మరో వ్యక్తి ప్రాణాలను నిలబెట్టడం కేవలం అవయవ దానం ద్వారానే సాధ్యం. అలా చేస్తే చనిపోయినా కూడా ఆ వ్యక్తి అవయవాలు మరొకరిలో బ్రతికే ఉంటాయి. ఇక  అవయవ మార్పిడి కోసం ఆధునిక శాస్త్ర సాంకేతికత కూడా అందుబాటులోకి వస్తోంది. […]

ఇవి కేవలం డ్రోన్లు మాత్రమే కాదు..అవయవదానానికి వాహకాలు
Follow us on

ఈ మధ్య కాలంలో అవయవదానం పట్ల అవగాహన బాగా పెరిగింది. బ్రెయిన్ డెడ్ అయినవాళ్లు, ప్రమాదాల్లో మృతి చెందిన వారి అవయవాలను డోనేట్ చేసేందుకు వారి కుటుంబ సభ్యులు ముందుకు వస్తున్నారు.  మనిషి మరణించాక కూడా.. మరో వ్యక్తి ప్రాణాలను నిలబెట్టడం కేవలం అవయవ దానం ద్వారానే సాధ్యం. అలా చేస్తే చనిపోయినా కూడా ఆ వ్యక్తి అవయవాలు మరొకరిలో బ్రతికే ఉంటాయి. ఇక  అవయవ మార్పిడి కోసం ఆధునిక శాస్త్ర సాంకేతికత కూడా అందుబాటులోకి వస్తోంది. తాజాగా డొనేట్ చేసిన అవయవాలను అవసరం ఉన్నవారికి చేరవేసేందుకు.. మేరీలాండ్ యూనివర్సిటీకి చెందిన వైద్యులు, ఇంజనీర్స్ కలిసి ఓ మానవ రహిత డ్రోన్‌ను రూపొందించారు. అవయవ మార్పిడి కోసం అవసరమైన అవయవాలను తరలించడం ఈ డ్రోన్ ప్రత్యేకత. అవయవ మార్పిడి సమయంలో వీలైనంత త్వరగా.. వాటిని వేరేవాళ్లకు అమర్చాల్సి ఉంటుంది కాబట్టి ప్రతీ సెకను కూడా విలువైనదే. అయితే ప్రస్తుత తరుణంలో.. ట్రాఫిక్, ఇతరత్రా సమస్యల రీత్యా.. అవయవాలను సకాలంలో పేషెంట్ వద్దకు తరలించడం కష్టసాధ్యమైపోయింది. ఈ సమస్యను అధిగమించడానికే మేరీలాండ్ వర్సిటీ వైద్యులు, ఇంజనీర్లు ప్రత్యేక డ్రోన్‌ను రూపొందించారు.

ఈ మానవ రహిత డ్రోన్ ద్వారా 44ఏళ్ల ఓ వ్యక్తి దానం చేసిన కిడ్నీని సకాలంలో పేషెంట్‌కు అమర్చగలిగారు. ప్రపంచంలో ఇలా మానవరహిత డ్రోన్ ద్వారా అవయవాలను తరలించడం ఇదే మొట్టమొదటిసారి. సకాలంలో తరలించలేని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా కొన్ని వేల అవయవాలు వృథాగా పోతున్నాయి. గతేడాది 2700 కిడ్నీలను సకాలంలో గమ్య స్థానానికి చేర్చలేక.. అప్పటికే సమయం మించిపోవడంతో వాటిని వృథాగా పడేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏటా 1.5శాతం అవయవాలు సకాలంలో గమ్యస్థానాన్ని చేరుకోలేకపోతున్నాయి. తాజాగా రూపొందించిన మానవ రహిత డ్రోన్ ద్వారా.. ఒక దాత నుంచి సేకరించిన కిడ్నీని మరో పేషెంట్‌ వద్దకు 10 నిమిషాల్లో తరలిచంగలిగామని వైద్యులు చెప్పారు. 2.8మైళ్ల దూరం అది ప్రయాణించిందని.. విజయవంతంగా ట్రాన్స్‌ప్లాంటేషన్ పూర్తి చేశామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇది అందుబాటులోకి వస్తే.. అవయవాల కోసం ఎదురుచూస్తున్న ఎంతోమంది ప్రాణాలు నిలబడే అవకాశం ఉంది.