సామాన్యుడి సమస్యలను అర్థం చేసుకున్న ఆర్బీఐ.. అందుకు తగ్గట్లు కొన్ని కొత్త రూల్స్ను ప్రకటించింది. ఇప్పటి వరకు నగదును తీసుకునేందుకు ఉపయోగించే ఏటీఎంలలో సమస్యలు తలెత్తితో సదరు కస్టమర్ బ్యాంకుల చుట్టు తిరగాల్సి వచ్చే. ఒకవేళ లావాదేవీలు జరిపే సమయంలో అది విఫలమై.. కస్టమర్ ఖాతా నుంచి నగదు డెబిట్ అయినా కూడా ఏటీఎం మిషన్ నుంచి డబ్బులు రాకపోయేది. అయితే ఆ సమయంలో డెబిట్ అయిన సొమ్ము అకౌంట్లో క్రెడిట్ అవ్వకపోతే.. ఆ సమయంలో సదరు వినియోగదారుడు ఆ బ్యాంకులో ఫిర్యాదు చేసి.. చెప్పులు అరిగేలా తిరగాల్సి వచ్చేది. అయితే.. ఈ సమస్యలకు కారణం బ్యాంకుల అలసత్వమేనంటూ కస్టమర్లు ఆరోపణలు చేసేవారు. దీంతో ఆర్బీఐ ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కొత్త రూల్స్ను తెరమీదకు తెచ్చింది. ఏటీఎం, ఇతర నగదు లావాదేవీలు విఫలమైనప్పుడు తీసుకోవాల్సిన చర్యలు ఇతర అంశాలను తాజాగా ప్రకటించింది. నగదు ఖాతా నుంచి తగ్గి ఏటీఎం నుంచి డబ్బు వినియోగదారుడికి అందనప్పుడు తగిన గడువులోగా రీఫండ్ కాకపోతే పరిహారం చెల్లించాలని పేర్కొంది. దీంతోపాటు పలు మార్పులను కూడా ఆర్బీఐ చేసింది. అవేంటో ఓ లుక్ వేయండి..
కొత్త నిబంధనల ప్రకారం..
* ఏటీఎంలో లావాదేవీలు చేసే సమయంలో కస్టమర్ అకౌంట్ నుంచి డబ్బు డెబిట్ అయి.. నగదు రాని సమయంలో.. నియమిత గడువు తేదీ లోపు తిరిగి జమ కావాలి. సాధారణంగా అయితే ట్రాన్సాక్షన్ జరిగిన రోజుతోపాటు మరో 5 పనిదినాలు బ్యాంకులకు గడువు ఉంటుంది. అయితే ఈ అయిదు రోజులు కూడా దాటితే ఆలస్యమయ్యే ప్రతి అదనపు రోజుకు రూ.100 చొప్పున పరిహారం చెల్లించాలి. ఈ నిబంధన మైక్రో ఏటీఎంలకు కూడా వర్తిస్తుంది.
* ఏటీఎంలో హార్డ్వేర్, సాఫ్ట్వేర్, కమ్యూనికేషన్ కారణాల వల్ల ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే.. దానిని లావాదేవీల లెక్కలోకి తీసుకోరు. చాలా బ్యాంకులు పరిమిత సంఖ్యలో ఏటీఎం లావాదేవీలను ఉచితంగా అందజేస్తున్నాయి. వాటిని మించిన తర్వాత అదనపు లావాదేవీలుగా పరిగణిస్తాయి.
* ఒక వేళ ఏటీఎంలో నగదు లేకపోవడం కారణంగా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే.. దానిని కూడా లెక్కలోకి తీసుకోకూడదు. దీనికి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదు.
* ఇక తప్పుడు పిన్ నంబర్లు ఇతర కారణాలతో చేసిన ట్రాన్సాక్షన్లు విఫలమైనా వాటిని కూడా సర్వర్లు లెక్కలోకి తీసుకోకూడదు. ఈ విషయాలను ఆర్బీఐ ఆగస్టు 14న విడుదల చేసిన సర్క్యులర్లో పేర్కొంది.