చిన్న దేశమైన ఇజ్రాయెల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మూన్ మిషన్’ విఫలమైంది. చంద్రుడి ఉపరితలంపై దిగేందుకు పంపించిన ‘బేరెషీట్’ అంతరిక్ష నౌకలో చివరి దశలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో ఇది చంద్రుడి ఉపరితలంపై మరికాసేపట్లో దిగుతుందనగా కుప్పకూలింది.
ఈ ప్రయోగం కోసం ఇజ్రాయెల్ సుమారు 100 మిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ సంస్థ ‘స్పేస్ఐఎల్’, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా ఈ అంతరిక్ష నౌకను నిర్మించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 22న ‘ఫాల్కన్ 9’ రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారు. సుమారు 7 వారాల పాటు అంతరిక్షంలో ప్రయాణించిన బేరెషీట్ స్పేస్క్రాఫ్ట్.. గతవారమే చంద్రుడి గురుత్వాకర్షణ పరిధిలోకి ప్రవేశించింది. కక్ష్యలను పెంచడం ద్వారా ఈ స్పేస్క్రాఫ్ట్ను చంద్రుడి సమీపంలోకి చేర్చారు. గురువారం (ఏప్రిల్ 11) చంద్రునిపై లాండింగ్ సమయంలో రోబోటిక్ లాండర్లోని ఇంజిన్లో సాంకేతిక లోపంతో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా దెబ్బతినడంతో ఈ ప్రయోగం విఫలమైంది.
ఇప్పటివరకూ చంద్రుడిపై అమెరికా, రష్యా, చైనా దేశాలు మాత్రమే సురక్షితంగా లాండర్లను దించగలిగాయి. చంద్రుడి ఉపరితలంపై పరిశోధనకు ఉద్దేశించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ‘చంద్రయాన్-2’ మిషన్ను ఈ ఏడాది జులైలో చేపట్టనున్నారు.
The attempt of an Israeli-built spacecraft to land on the moon appears to have ended in a crash https://t.co/xnXCTwVUlh
— NYT Science (@NYTScience) April 11, 2019