విండీస్ మాజీ క్రికెటర్.. బ్రియాన్ లారా.. రికార్డుల గురించి తెలిసిందే. అటు వన్డేల్లో.. ఇటు టెస్టుల్లో రికార్డులను సృష్టించాడు. అయితే దాదాపు ఆయన రికార్డులను కొందరు నేటి ఆటగాళ్లు చెరిపేసినా.. మరో రికార్డు మాత్రం పదిలంగా ఉంది. ఇప్పటికీ ఆయన టెస్టుల్లో 400 పరుగులు చేసిన రికార్డును ఇంకా ఎవరూ బ్రేక్ చేయలేదు. 15ఏళ్లుగా ఆ రికార్డును ఎవరు తిరగరాస్తోరన్న దానిపై సగటు క్రికెట్ అభిమాని వేచిచూస్తున్నాడు. అయితే అసలు ఈ రికార్డును ఎవరు తిరగరాస్తారు..? వారు ఏ దేశానికి చెందిన వారై ఉంటారు..? అలా ఎవరు ఉన్నారు.. అన్న దానిపై తరచూ ప్రశ్నలు ఉత్పన్నమయ్యేవి. అయితే వీటికి సమాధానాన్ని లారా చెప్పుకొచ్చాడు. తన రికార్డును తిరగరాసే వారు ముగ్గురు ఉన్నారని.. అది వారికే సాధ్యమవుతుందని స్పష్టం చేశాడు.
అంతేకాదు.. వారి పేర్లను కూడా బయటపెట్టాడు. వారు మరెవరో కాదు.. ఆసీస్ డాషింగ్ బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్ ఒకరైతే.. మిగతా ఇద్దరు టీమిండియా సభ్యులన్నారు. హిట్ మ్యాన్ రోహిత్ ఒకరు కాగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంకొకరన్నారు. వీరే తన రికార్డును బద్ధలుకొట్టగలిగే సమర్ధులన్నారు.
ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఐసీసీ నిర్వహించే అన్ని టోర్నీల్లో విరాట్ నేతృత్వంలోని టీమిండియా విజయం సాధించగలదన్నాడు. ఐసీసీ టోర్నీల్లో అన్ని జట్ల టార్గెట్ టీమిండియానే కాగలదని.. కోహ్లీ నేతృత్వంలో టీమిండియా అటు టెస్టుల్లోనూ, ఇటు వన్డేల్లోనూ అత్యున్నత శిఖరాలను అధిరోహించిందని ప్రశంసించాడు.