న్యూఢిల్లీ: రెండు రోజుల క్రితం మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో భారీ స్కోరు సాధించినా.. దాన్ని కాపాడుకోవడంలో సక్సెస్ కాలేకపోయింది ఇండియన్ టీం. ఈ మ్యాచ్లో కోహ్లీసేన ఫీల్డింగ్, బౌలింగ్లో కొన్ని పొరపాట్లు చేయడమే దీనికి కారణం. ఆ పొరపాట్లలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వైఫల్యం కూడా ఉంది. మ్యాచ్ను మలుపు తిప్పిన టర్నర్ను స్టంప్ చేయడంలో పంత్ విఫలమయ్యాడు. దీంతో అతడిపై సోషల్ మీడియా వేదికగా విమర్శల వెల్లువెత్తుతున్నాయి. చాలామంది ట్రోల్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
ఈ క్రమంలో పంత్కు అతడి కోచ్ తారక్ సిన్హా ధైర్యాన్ని ఇచ్చాడు. ఈ విషయంపై ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘‘పంత్, ధోనీతో ఇద్దరూ కీపర్ కమ్ బ్యాట్స్మన్సే. అయినంత మాత్రాన వీరిద్దరినీ పోల్చడం సరికాదు. అతనింకా నేర్చుకునే స్థితిలోనే ఉన్నాడు. నెగటీవ్గా కామెంట్స్ చేస్తే పంత్పై ఒత్తిడి పెరుగుతుంది. ఇదే మొహాలీ వన్డేలో జరిగింది. ఎప్పుడైతే అతడు ఒత్తిడి లేకుండా ఉంటాడో అప్పుడే మంచి ఆటను రాబట్టగలం. పంత్ కీపింగ్ సరిగా చేయలేదని అంటున్నారు. ధోనీ కూడా తన తొలినాళ్లలో ఇలాగే ఇబ్బందులు పడ్డాడు. అప్పుడు అతడు బోలెడు క్యాచ్లు వదిలేశాడు. స్టంపింగ్లు కూడా సరిగా చేయలేకపోయాడు. వాస్తవానికి ధోనీ క్రికెట్లో అడుగుపెట్టిన సమయంలో లెజెండరీ కీపర్లు లేరు. దినేష్ కార్తీక్, పార్థీవ్ పటేల్ ఉన్నా వాళ్లు ధోనీ కంటే చిన్నవాళ్లే. అందుకే అతడు ఒత్తిడి లేకుండా ఆడేవాడు’’ అని ఆయన చెప్పుకొచ్చారు.
మరోవైపు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూడా పంత్కు బాసటగా నిలిచాాడు. ‘ 21 ఏళ్ల వయసుకే భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో పంత్ ఆడుతున్నాడు. అతనొక యువ క్రికెటర్. అతని వయసులో మనం ఏం చేశామో ఒక్కసారి పరిశీలించుకుందాం. అతనికి ఒక చాన్స్ ఇవ్వండి. పంత్లో టాలెంట్ ఉంది. విమర్శలను పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టమని పంత్ను కోరుతున్నా’ అని సునీల్ శెట్టి ట్వీట్ చేశాడు.
He’s just 21 and represents India in all 3 formats. Let’s introspect and see what we were doing at that age. Give him a chance. @RishabPant777 u are pure talent keep the focus, you got this ! pic.twitter.com/GDySpRgiGU
— Suniel Shetty (@SunielVShetty) March 11, 2019