భారత్, దక్షిణాఫ్రికా మధ్య రాంచీ వేదికగా శనివారం మొదలైన మూడో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా జరుగుతోంది. ఇటీవల ముగిసిన వైజాగ్, పుణె టెస్టులో టీమిండియాకి పోటీనివ్వలేకపోయిన సఫారీ బౌలర్లు.. రాంచీలో మాత్రం తొలి సెషన్లోనే మూడు వికెట్లు పడగొట్టి ఒత్తిడిలోకి నెట్టేశారు. మొదటి సెషన్లోనే రోహిత్ శర్మ రూపంలో నాలుగో వికెట్ కూడా భారత్ చేజార్చుకునే ప్రమాదం కనిపించింది. కానీ.. కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని డీఆర్ఎస్ కోరిన రోహిత్ శర్మ.. తన వికెట్ని కాపాడుకున్నాడు. అప్పటికి రోహిత్ 26 బంతుల్లో 7 పరుగులు చేసి ఉండగా.. రెండో సెషన్లో గేర్ మార్చి కేవలం 130 బంతుల్లోనే 13×4, 4×6 సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
కాగా… రోహిత్ మూడో టెస్టులో మరొక వరల్డ్ రికార్డును నెలకొల్పాడు. ఒక టెస్టు సిరీస్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మన్గా రోహిత్ రికార్డులకెక్కాడు. మూడో టెస్టులో మూడో సిక్సర్ కొట్టిన తర్వాత ఈ సిరీస్లో 16వ సిక్సర్ను రోహిత్ ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా ఒక టెస్టు సిరీస్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ ఆటగాడు హెట్మెయిర్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. 2018-19 సీజన్లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన సిరీస్లో హెట్మెయిర్ 15 సిక్సర్లు కొట్టాడు. దాన్ని రోహిత్ తాజా బద్ధలు కొట్టాడు.
కాగా, భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు కూడా తుడిచిపెట్టుకుపోయింది. 2010-11 సీజన్లో న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో హర్భజన్ సింగ్ 14 సిక్సర్లు కొట్టాడు. ఇదే ఒక్క టెస్టు సిరీస్లో భారత్ తరఫున ఇప్పటివరకూ అత్యధిక వ్యక్తిగత సిక్సర్ల రికార్డు. దాన్ని కూడా సవరించాడు రోహిత్. ఇదిలా ఉంచితే, ఈ మ్యాచ్లో రోహిత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 130 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్లతో శతకం సాధించాడు. సిక్సర్తో సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. ఇది రోహిత్కు టెస్టుల్లో 6వ సెంచరీ కాగా, ఈ సిరీస్లో మూడో శతకం. అదే సమయంలో టెస్టుల్లో రెండు వేల పరుగుల్ని రోహిత్ పూర్తి చేసుకున్నాడు. ఇది రోహిత్కు 30వ టెస్టు.