ముంబై: యువ క్రికెటర్ పృథ్వీ షాపై బీసీసీఐ ఎనిమిది నెలల నిషేధం విధించడం కఠిన శిక్ష అని టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ వెంగ్సర్కార్ అన్నారు. అతడి కుటుంబ పరిస్థితులు, వయసును పరిగణనలోకి తీసుకొని తక్కువ శిక్ష వేయాల్సిందని వెల్లడించారు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ సమయంలో నిర్వహించిన డోప్ పరీక్షల్లో షా టెర్బుటలైన్ అనే నిషేదిత డ్రగ్ తీసుకున్నట్లు తేలడంతో బోర్డు నిషేధం విధించింది. అయితే పృథ్వీ షా దీనిపై వివరణ ఇస్తూ తాను దగ్గు మందు తీసుకోవడం వల్లే ఇలా జరిగిందని అన్నాడు. దీంతో అతడికి మార్చి 16 నుంచి నవంబర్ 15 వరకు 8 నెలల నిషేధం విధించారు.
పృథ్వీ షాకు ఇలాంటి విషయాలపై అవగాహన లేదని.. బీసీసీఐ వాటిని వివరిస్తే మంచిదని వెంగ్సర్కార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అతడి శిక్షను నాలుగు నెలలకు కుదిస్తే బాగుండేదని తెలిపారు.