బీసీసీఐ అధ్యక్షుడిగా అక్టోబర్ 23న బాధ్యతలు తీసుకుంటున్న దాదాకు గౌతమ్ గంభీర్ అభినందనలు తెలియజేశాడు. ఆయనకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించాలని కోరుకున్నాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీకి 10 నెలల కన్నా ఎక్కువ సమయం ఇస్తే బాగుంటుందని గంభీర్ తెలిపాడు.
వ్యవస్థపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి భారత క్రికెట్కు అధినేత కావడం సంతోషకరం. తన ముద్ర వేసేందుకు దాదాకు 10 నెలల కన్నా ఎక్కువ పదవీకాలం లభించాలని కోరుకుంటున్నా. లేదంటే మొత్తం కసరత్తు వృథానే. బోర్డులో అనేక మార్పులు తీసుకొస్తారనేందుకు బెంగాల్ క్రికెట్ సంఘంలో తీసుకొచ్చిన మార్పులే సూచన. ఇప్పుడు పాలకుడిగా ఆయన నైపుణ్యాలకు పరీక్ష ఎదురుకానుంది. సమ్మిళిత అభివృద్ధే దాదా సత్తా ఏంటో తెలియజేస్తుంది’ అని గౌతీ పేర్కొన్నాడు.
ప్రతి ఒక్కరూ గంగూలీకి మద్దతు ఇస్తారని భావిస్తున్నా. బీసీసీఐ బోర్డు రూం, డ్రస్సింగ్ రూం నుంచి సహకారం లభిస్తేనే ఆయన ఫలితాలు రాబట్టగలరు. అప్పట్లో జగ్మోహన్ దాల్మియా ప్రోత్సాహం లేకుంటే గంగూలీకి ఎన్నో సవాళ్లు ఎదురయ్యేవి. దాదా, కోచ్ జాన్రైట్ కలిసే యువకులైన సెహ్వాగ్, నెహ్రా, యువరాజ్, హర్భజన్, జహీర్ను పెంచి పెద్దచేశారు. ద్రవిడ్, కుంబ్లే, సచిన్, లక్ష్మణ్ మద్దతూ ఆయనకు ఉండేది. ఇక నుంచి భారత క్రికెట్ను ప్రపంచం మరింత ఆసక్తితో చూస్తుంది. అని గంభీర్ వివరించాడు.