ఐపీఎల్ 12వ సీజన్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయంతో ముగించింది. చివరి లీగ్ మ్యాచ్లో సన్రైజర్స్ను 4 వికెట్ల తేడాతో ఓడించి చిరునవ్వుతో సీజన్ను పూర్తి చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (70*; 43 బంతుల్లో 5×4, 4×6) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా చివరి ఓవర్లో చెలరేగి భారీ సిక్సర్లు, బౌండరీలతో జట్టు స్కోరును 170 దాటించాడు. మార్టిన్ గప్తిల్ (30; 23 బంతుల్లో 2×4, 2×6), వృద్ధిమాన్ సాహా (20; 11 బంతుల్లో 4×4), విజయ్ శంకర్ (27; 18 బంతుల్లో 3×6) మెరిశారు.
అనంతరం బ్యాటింగ్కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు.. ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. ఓపెనర్ పార్థివ్ (0), కెప్టెన్ విరాట్ కోహ్లీ (16; 7 బంతుల్లో 2×4, 1×6), ఏబీ డివిలియర్స్ (1; 2 బంతుల్లో) తక్కువ స్కోర్కే పెవిలియన్ చేరారు. ఈ క్రమంలో బ్యాటింగ్కు వచ్చిన వెస్టిండీస్ బ్యాట్స్మెన్ హెట్మైయిర్ (75; 47 బంతుల్లో 4×4, 6×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారీ సిక్సర్లు, బౌండరీలతో సన్రైజర్స్ బౌలింగ్ను ఊచకోత కోశాడు. అతడికి తోడుగా గురుకీరత్ సింగ్ మన్ (65; 48 బంతుల్లో 8×4, 1×6) అజేయ అర్ధశతకం తోడవ్వడంతో బెంగళూరు లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. హెట్మైయిర్, గురుకీరత్ నాలుగో వికెట్కు 144 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి రికార్డు సృష్టించారు. ఐపీఎల్లోనే నాలుగో వికెట్కు ఇది అత్యధిక భాగస్వామ్యం. దీంతో సన్రైజర్స్ ప్లేఆఫ్ రేస్లో నిలవాలంటే ఈరోజు జరిగే మ్యాచ్లో కోల్కతాపై ముంబై ఇండియన్స్ తప్పక విజయం సాధించాలి.