ఊహించని విజయాలు, అనుకోని పరాజయాలు.. కొన్ని వివాదాలు, మరికొన్ని వినోదాలు ఇలా రసవత్తరంగా సాగింది ఈ ఏడాది ఐపీఎల్. చూస్తూ చూస్తూనే ఐపీఎల్ చివరి అంకంకు చేరుకుంది. మూడేసి సార్లు టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాయి. ఈ రోజు సాయంత్రం 7.30 గంటలకు హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియంలో సమఉజ్జీల మధ్య భీకర పోరుకు రంగం సిద్ధమైంది. చూద్దాం మరికొన్ని గంటల్లో ఐపీఎల్ నాలుగో టైటిల్ను ఎవరు విన్ అవుతారో..?
ఇకపోతే ఈ సీజన్ ఇప్పటికే మూడు సార్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును చిత్తుగా ఓడించిన ముంబై ఇండియన్స్.. అదే జోరు ఫైనల్లో కొనసాగించి టైటిల్ను సొంతం చేసుకోవాలని చూస్తుంది. అటు క్వాలిఫైయర్ 2లో ఢిల్లీని చిత్తు చేసి ఫైనల్కు చేరిన ధోని సేన.. టైటిల్ను గెలిచి కెప్టెన్ కూల్కి ఘనమైన వీడ్కోలు పలకాలని భావిస్తోంది.
డికాక్, రోహిత్, పొలార్డ్, హార్దిక్ పాండేలతో ముంబై బ్యాటింగ్ లైన్అప్ స్ట్రాంగ్ ఉండగా.. పాండే బ్రదర్స్, మలింగా, బుమ్రా, రాహుల్ చాహర్తో బౌలింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండే, పేసర్ బుమ్రా ఈ ఫైనల్లో రాణిస్తే టైటిల్ ఫేవరెట్స్ ముంబై అని అంటున్నారు క్రీడా విశ్లేషకులు.
మరోవైపు చెన్నై జట్టు కూడా పటిష్టమైన లైన్అప్తో బలంగా ఉంది. ఫామ్ కోల్పోయిన షేన్ వాట్సన్, డుప్లెసిస్లు మళ్ళీ తిరిగి ఫామ్లోకి రావడం వారికీ సానుకూలాంశం. బౌలర్లు హర్భజన్, దీపిక్ చాహర్, తాహిర్, జడేజాలు టోర్నీ ఆరంభం నుంచి రాణిస్తూ ప్రతీ విజయంలోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అటు కెప్టెన్ ధోని ఈ సీజన్లో భీకర ఫామ్లో ఉన్నాడు. 2019 వరల్డ్ కప్ తర్వాత క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని చూస్తున్న ధోని.. ఈ సీజన్ టైటిల్ ఎలాగైనా గెలవాలని కసితో ఉన్నాడు.