దాయాది పాకిస్థాన్ను అంచనా వేయడం కష్టమని మరోసారి రుజువైంది. ప్రపంచకప్ మొదటి మ్యాచ్లో విండీస్ చేతిలో ఘోర పరాజయం చవి చూసి.. విమర్శలు ఎదుర్కుంటున్న పాక్.. సోమవారం ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టుకు షాక్ ఇస్తూ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దీంతో ప్రపంచ నెంబర్వన్ ఇంగ్లాండ్ ఊహించని విధంగా ఓటమిపాలైంది. వివరాల్లోకి వెళ్తే…
నాటింగ్హామ్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ ఆతిధ్య ఇంగ్లాండ్ను 14 పరుగులు తేడాతో ఓడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్.. హఫీజ్ (84; 62 బంతుల్లో 8×4, 2×6), బాబర్ అజామ్ (63; 66 బంతుల్లో 4×4, 1×6), సర్ఫ్రాజ్ (55; 44 బంతుల్లో 5×4) మెరవడంతో నిర్ణేత 50 ఓవర్లలో 8 వికెట్లకు 348 పరుగులు చేసింది.
ఇక లక్ష్యఛేదనలో భాగంగా బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్కు.. రూట్ (107; 104 బంతుల్లో 10×4, 1×6), బట్లర్ (103; 76 బంతుల్లో 9×4, 2×6) సెంచరీలతో అదరగొట్టినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. దీంతో నిర్దేశించిన ఓవర్లలో 9 వికెట్లకు 334 పరుగులే చేయగలిగింది. కాగా పాకిస్థాన్ విజయంలో కీలకపాత్ర పోషించిన హఫీజ్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.