ఐసీసీ ప్రపంచ కప్లో భాగంగా నాటింగ్ హామ్ వేదికగా వెస్టిండీస్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్లో పాక్ ఘోర పరాజయం మూటగట్టుకుంది. విండీస్ అన్ని విభాగాల్లో రాణించడంతో పాక్ను 105 పరుగులకే కట్టడి చేసింది. మ్యాచ్ క్రెడిట్ను ఆ జట్టు సారథి జేసన్ హోల్డర్ బౌలర్లకే అంకితం చేశాడు. ఈ మేరకు అతడు మీడియాతో మాట్లాడాడు.
‘ప్రపంచ కప్ టోర్నీని విజయంతో ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది. మ్యాచ్ క్రెడిట్ బౌలర్లకే అంకితం. క్రిస్గేల్ ఎప్పటిలాగానే అద్భుతంగా ఆడాడు. ఇక మా జట్టుకు దొరికిన అరుదైన ఆటగాడు రసెల్. అతడి ప్రభావం జట్టులో చాలా ఉంటుంది. అతడే మా ఆస్తి. ఒషానే, షెల్డోన్ కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు. ఒషానే బౌలింగ్లో మ్యాచ్ గెలవాలన్న కసి కనిపించింది. మొదటి మ్యాచ్ ఎలా సాగుతుందోనని చాలా కంగారు పడ్డాను. మాకెలాంటి అంచనాలు లేవు. ఎలాంటి ఒత్తిడి లేకుండా క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాం’ అని తెలిపాడు.