ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న చర్చ. నియోజకవర్గాల పునర్విభజన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత.. తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగనుందంటూ చాలా సార్లు వార్తలు వెలువడ్డాయి. అయితే తాజాగా ఆర్టికల్ 370 రద్దు కశ్మీర్ విభజన తర్వాత కశ్మీర్ తోపాటు రెండు తెలుగు రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కేంద్రం ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో తెలంగాణ, ఏపీలోని అధికార పార్టీ నేతలు సంబరపడుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కారెక్కిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కారు ఓవర్ లోడ్తో ఉందంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు వినిపిస్తున్న ఈ నియోజకవర్గ పునర్విభజన వార్తలు అధికార పార్టీకి ఊరటనిచ్చేలా ఉన్నాయి. దీంతో కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.
తెలంగాణలో కేంద్రం కనుక నియోజకవర్గాల పునర్విభజన చేస్తే అది టీఆర్ఎస్కే భారీ లాభం చేకూరుతుందని తెలుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు కారెక్కిన విషయం తెలిసిందే. అంతేకాదు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీనే టీఆర్ఎస్లో విలీనం చేశారు. అయితే వీరందరి చేరికతో భవిష్యత్తులో సీట్ల కేటాయింపులో తలనొప్పులు వస్తాయని ఇన్నాళ్లు అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని చెప్తూ.. కారు ఓవర్ లోడ్తో ఉందంటూ ఇతర పార్టీల నేతలను బీజేపీ ఆకర్షించే పనిలో పడింది. అయితే తాజాగా నియోజకవర్గాల పునర్విభజన అంశం కమలనాథులను ఆలోచనలో పడేసింది. నియోజకవర్గాల పునర్విభజన చేస్తే టీఆర్ఎస్ పార్టీకి లాభం అవుతుందని.. పార్టీ మారిన వారందరికీ న్యాయం చేయడానికి కేసీఆర్కు అవకాశం ఇచ్చినట్లవుతుందన్న అభిప్రాయం వెలువడుతోంది.
అయితే ఈ నియోజకవర్గాల పెంపుతో తమకే లాభం అని లెక్కలు వేసుకుంటోంది బీజేపీ. బలమైన కుల, మత ప్రాంత భాగాలను వేరు చేయడం ద్వారా.. పునర్విభజనతో టీఆర్ఎస్ ఓటు బ్యాంకును చెల్లాచెదురు చేసి ఓట్లు చీల్చితే తమకు లాభం చేకురుతుందన్న ఆలోచనలో బీజేపీ ఉందన్న వార్తలు కూడా వెలువడుతున్నాయి.
మొత్తంగా నియోజకవర్గాల పునర్విభజన అంశం చుట్టూ ఆశావహులు భారీ ఆశలు పెంచుకున్నారు. మరి ఒకవేళ నిజంగానే కేంద్రం పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. అప్పుడు కారు పరుగెత్తుతుందో, కమలం వికసిస్తుందో చూడాలి మరి.